కరోనా దెబ్బకు ఐపీఎల్ రద్దు తర్వాత క్రీడాలోకాన్ని షాక్ కు గురిచేసిన మరో సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.ప్రఖ్యాత ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండుగా విడిపోయిన రెజ్లర్లు ఘర్షణకు దిగారు.
ఈ ఘటనలో యువ రెజ్లర్ సాగర్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు.ఈ కేసులో ఒలింపియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తోన్న పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
క్రీడా ప్రాంగణాల్లో ప్లేయర్ల ప్రాక్టీస్ కు అనుమతి కొనసాగుతున్న దరిమిలా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో కొందరు ప్లేయర్లు శిక్షణకు హాజరవుతున్నారు.అయితే, మంగళవారం రాత్రి రెండు వర్గాల రెజ్లర్ల మధ్య ఘర్షణ జరిగింది.
ఒలింపిక్ మెడల్ విజేత సుశీల్ కుమార్ నాయకత్వంలోని వర్గం అవతలివారిపై దాడి, కాల్పులు జరపడంతో ఓ యువ రెజ్లర్ చనిపోయాడు.చనిపోయిన రెజ్లర్ ను 23 ఏళ్ల సాగర్ కుమార్ గా గుర్తించారు.
అతను జూనియర్ నేషనల్ ఛాంపియన్ అని, తదుపరి టోర్నీల కోసం ఛత్రసాల్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.ఈ ఉదంతంపై సుశీల్కుమార్తోపాటు మరికొందరిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హత్యతో తనకు సంబంధం లేదని సుశీల్ చెబుతున్నప్పటికీ అతని కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.బాధితుల వాంగ్మూలం ప్రకారం ఈ హత్య కేసులో సుశీల్ ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
స్టేడియంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.గత కొన్ని రోజులుగా బృందాలుగా ఏర్పడి సుశీల్ కోసం వెతుకుతున్న పోలీసులకు అతని జాడ లభ్యం కాలేదు.
దీంతో తాజాగా అతడి కోసం లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.