ముంబై హైకోర్టు లో దాఖలైన ఒక పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించింది.మనవడిని చూడడానికి అవకాశం ఇవ్వాలి అని కోరుతూ ఫ్యామిలీ కోర్టు లో అత్త,మామలు వేసిన పిటీషన్ పై ముంబై హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది.
అసలు వివరాల్లోకి వెళితే… ముంబై కి చెందిన ఒక మహిళా కొన్నేళ్ల క్రితం ఢిల్లీ కి చెందిన వ్యక్తి తో వివాహం జరిగింది.అయితే వివాహం అయినప్పటి నుంచి కూడా భర్త,అత్తామామలతోనే కలిసి ఢిల్లీ లో ఉండేది.
అయితే 2009 లో వారికి ఒక అబ్బాయి పుట్టాడు.అయితే బాబు పుట్టాడు అని సంతోషంగా ఉంటుండగా 2010 లో ఆ మహిళ భర్త దురదృష్ట వశాత్తు చనిపోయాడు.
అయితే భర్త చనిపోవడం తో ఆమె ఆ కుటుంబాన్ని వదిలేసి కుమారుడిని తీసుకొని ముంబై లోని తన అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది.
అయితే ఇక అప్పటి నుంచి కూడా అత్తమామలను దగ్గరకు కూడా రానివ్వలేదు సరికదా మనవడిని చూడడానికి కూడా అనుమతించలేదు.అయితే ఆ సమయంలోనే ఆ మహిళ రెండో వివాహం చేసుకుంది.దీనితో మనవడిని చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని కోరుతూ ఆ మహిళ అత్తమామలు ఫ్యామిలీ కోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు.
అయితే ఫ్యామిలీ కోర్టు కూడా మనవడిని చూడడానికి వారికి అవకాశం ఇవ్వాలి అని తీర్పు వెల్లడించింది.అయినప్పటికీ కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయని ఆ మహిళ మరలా మనవడిని చూడడానికి అవకాశం ఇవ్వలేదు.
అలానే వారికి వ్యతిరేకంగా ముంబై హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసింది.అయితే పెళ్లై వెళ్లిన తరువాత నన్ను సరిగా చూసుకోలేదని చాలా ఇబ్బందులు పెట్టారని ఆరోపించింది.
అంతేకాకుండా ఇప్పటి వరకు నా కుమారుడు తన తాత, నానమ్మ లను చూడలేదు,ఇక మీదట కూడా చూడడానికి అవకాశం ఇవ్వొద్దు అంటూ కోర్టును కోరింది.
అయితే ఆ మహిళ వాదన తో ఏకీభవించని కోర్టు పెళ్ళైన తరువాత అత్తమామలు సరిగా చూడలేదు అన్న దాన్ని కారణంగా చెప్పి వారు మనవడి ని కలవకుండా చేయడం కుదరదు అని, ఇప్పటివరకు వారు మనవడిని కలుసుకోలేకపోవడానికి తల్లిగా మీరే కారణం అని కోర్టు స్పష్టం చేసింది.
తాత, నానమ్మలను కలిసేందుకు పిల్లలకు, పిల్లలను కలిసేందుకు వారికి హక్కు ఉంటుందని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.తప్పనిసరిగా వారానికి ఒక్కరోజు మనవడిని చూసుకొనే అవకాశం వారికి కల్పించాలి అంటూ ముంబై హైకోర్టు తీర్పు వెల్లడించింది.