ఉత్తర కొరియా, ఇరాన్ అణు కార్యక్రమాలు అమెరికాతో పాటు ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని బైడెన్ అభిప్రాయపడ్డారు.అలాగే ఈ దేశాలపై దౌత్యపరంగా కఠినమైన ఆంక్షలు విధించే అంశాన్ని మిత్ర దేశాలతో చర్చించి నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.ఈ వ్యాఖ్యలపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది.“గత యాభై ఏళ్లుగా ఉత్తర కొరియా పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ప్రతిబింబించేలా బైడెన్ ప్రకటన ఉంది.శత్రు విధానాలను అమలు చేయాలనే ఆయన ఉద్దేశం స్పష్టం అవుతోంది.ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉత్తర కొరియా విధానం మారనుంది.అమెరికాపై ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది.అధ్యక్షుడి హోదాలో అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జో బైడెన్ గతవారం తొలిసారి చేసిన ప్రసంగాన్ని తప్పుబట్టింది ఉత్తర కొరియా.
అమెరికా ‘చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది‘ అని హెచ్చరించింది.గతంలో కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
హాయిగా నిద్రపోవాలనుకుంటే పిచ్చి పిచ్చి పనులను మానుకోవాలంటూ హెచ్చరించారు.గతంలో కూడా కిమ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అమెరికానే తమకు అతిపెద్ద శత్రువు అని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అమెరికా ఎన్నికల సమయంలో ప్రకటించారు.మరింత శక్తిమంతమైన అణ్వస్త్రాలు రూపొందించాలంటూ కిమ్ తన దేశ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది.ఎవరు అధికారంలోకి వచ్చినా వైట్ హౌస్ శత్రు విధానాల్లో మార్పు ఉండదని, ఒకవేళ ఆ విధానాలను విడనాడితే మాత్రం ఉత్తర కొరియా-అమెరికా సంబంధాల బలోపేతానికి కీలకం కాగలదని కిమ్ అభిప్రాయపడినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు చేసిన వ్యాఖ్యల వల్ల ఈ వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది.