మన దేశంలో హిందూ ఆలయాలను హైందవేతరులు అంటే నాన్ హిందూస్ సందర్శించాలంటే ప్రత్యేక అనుమతి అవసరం.ఈ నిబంధన అన్ని ఆలయాల్లో లేదు.
కొన్ని దేవాలయాల్లో మాత్రం కచ్చితంగా పాటిస్తున్నారు.కొన్ని ఆలయాల్లోకి నాన్ హిందూస్ను అసలు రానివ్వరు కూడా.
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లాలనుకున్నప్పుడు ఆమెకు అనుమతి ఇవ్వలేదు.కారణం ఆలయ అధికారులు ఆమెను హిందువుగా పరిగణించలేదు.
ఆమె భర్త ఫిరోజ్ గాంధీ ఫార్సీ కాబట్టి ఆమెను కూడా ఫార్సీగానే పరిగణించి అనుమతి నిరాకరించారు.తిరుమల ఆలయాన్ని సందర్శించాలనుకునే హైందవేతరులు వెంకటేశ్వరస్వామిపై తమకు విశ్వాసం ఉందని లిఖితపూర్వకంగా తెలియచేయాల్సిన నిబంధన ఉందని చెబుతారు.
ఇలా ఒక్కో రకమైన ఆలయానికి ఒక్కో విధమైన నిబంధన ఉంది.ఇలాంటి నిబంధన గుజరాత్లోని సోమనాథ ఆలయంలో ప్రవేశపెట్టారు.
ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునే నాన్ హిందూస్ ముందుగా అనుమతి తీసుకోవల్సి వుంటుంది.ఎందుకు ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నారో కూడా వివరించాల్సి ఉంటుంది.
దక్షిణ భారత దేశంలో అనేక ఆలయాల్లో భద్రత కారణాలరీత్యా ఈ నిబంధన పెట్టారని, తాము కూడా దీన్ని అనుసరిస్తున్నామని ఆలయ ట్రస్టు బోర్డు తెలిపింది.ఈ ట్రస్టు బోర్డులో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేకమంది భాజపా ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.
ఈ ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు కూడా ఉందని చెబుతున్నారు.అందుకే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారట.
దేశంలోని జ్యోతిర్లింగాల్లో సోమనాథ ఆలయం ఒకటి.