నూతన మోటర్ వెహికిల్ యాక్ట్ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.ఎప్పుడు ఎలాంటి జరిమానాలు విధిస్తారా అంటూ వాహనదారులు బిక్కు బిక్కు మంటూ రోడ్లపై తిరుగుతున్నారు.
కేంద్రం తీసుకువచ్చిన ఈ కొత్త చట్టం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా మరిన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి చూస్తున్నారు.అయితే ఈ చట్టం అమలులోకి వచ్చాక సైకిల్ నడిపే వారికి కూడా చలానా విధించడం, పరిమితికి మించిన లోడ్ తో వెళుతున్న లారీ కి రెండు లక్షల రూపాయల జరిమానా విధించడం వంటి చిత్ర విచిత్రమైన ఘటనలు చూడాల్సి వస్తుంది.
తాజాగా ఢిల్లీలో మరో వింత పెనాల్టీ ఘటన వెలుగులోకి వచ్చింది.నోయిడాకు చెందిన ఓ బస్సు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదంటూ, పోలీసులు రూ.500 పెనాల్టీ వేశారు.ఈ నెల 11న గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు ఈ చలానా రాసినట్లు బాధితుడు పేర్కొన్నారు.
అయినా బస్సు నడిపే డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని పెనాల్టీ విధించడం ఏంటో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.వివరాల్లోకి వెళితే….నోయిడాకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీ.బస్సులను అద్దెకు ఇస్తూ ఉంటుంది.
దాదాపు ఆ ట్రావెల్స్ సంస్థకు 80 బస్సులు ఉన్నాయి.అయితే ఆ బస్సులు రోజు బయట తిరిగేవి కావడంతో ఆ బస్సు డ్రైవర్లు ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిచారా అన్న విషయం తెలుసుకునేందుకు ఓ ఉద్యోగుడిని నియమించుకున్నారు.
అయితే ఆ ఉద్యోగి అన్ని బస్సుల వివరాలు చెక్ చేస్తుండగా ఓ బస్సుకు పోలీసులు విధించిన జరిమానా గురించి తెలుసుకొని ఖంగుతిన్నాడు.బస్సు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోకపోవడంతో రూ.500 పెనాల్టీ విధించినట్లు ఆ చలానా లో ఉంది.అయితే ఆన్ లైన్ లో ఎంటర్ చేయడంలో ఎదో పొరపాటు జరిగింది ఉంటుంది అని, త్వరలో సరిచేసిన జరిమానా యజమానికి పంపుతామని తెలిపారు.
అయితే బస్సు నంబరుతోనే మరేదైనా ద్విచక్ర వాహనం అక్కడ తిరుగుతుందా లేక.పొరబాటున వాహనం నంబర్ తప్పుగా ఎంటర్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మొత్తానికి నూతన వాహన చట్టం అమలులోకి వచ్చాక దేశ వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు చలాన్ల మోత తప్పడంలేదు.