దేశవ్యాప్తంగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అత్యాచార, హత్యా కండలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు కొద్ది రోజులు హడావుడి చేయడం ఆ తరువాత సైలెంట్ అయిపోవడం సర్వ సాధారణం అయిపొయింది.అయితే నేరానికి తగిన కఠిన శిక్షలు భారత దేశంలో లేకపోవడంతో ఈ పరిస్థితి వస్తోంది.చట్టాల్లో మార్పు తెచ్చి కఠిన శిక్షలు అమల్లోకి తెస్తే కానీ నేరాలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు.
2012 డిసెంబర్ 16 వ తేదీ రాత్రి నిర్భయ, ఆమె స్నేహితుడు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో నిర్భయపై కొందరు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.కదులుతున్న బస్సులో నుంచి నగ్నంగా ఆమెను బయటకి నెట్టివేశారు.అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.నిందితులను పట్టుకొని ఉరిశిక్ష విధించారు.అయితే, ఇప్పుడు వీరికి ఉరి తీసేందుకు తలారి లేకపోవడంతో తలారి కోసం తీహార్ జైలు అధికారులు అన్వేషిస్తున్నారు.
దానికి సరైన అర్హతలు కలిగిన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు.
మరో నెల రోజులలోపు జైలులో ఉన్న నిర్భయ నిందితులకు ఉరి అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఉరి శిక్ష పడిన వాళ్లల్లో రామ్ సింగ్ అనే వ్యక్తి 2013 మార్చిలో తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.ఇక అందులో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ళ శిక్ష తరువాత విడుదల చేశారు.
మిగతా నలుగురికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.పార్లమెంట్ దాడిలో దోషిగా నిరూపించబడిన అఫ్జల్ గురును తీహార్ జైలులో చివరిసారిగా ఉరితీశారు.
ఆ తరువాత నుంచి ఉరి శిక్ష పడ్డ ఖైదీల సంఖ్య పెరుగుతూ వస్తోంది.కానీ ఉరి తీసే తలారులు మాత్రం దొరకడంలేదు.