కేంద్రంలో ఎన్డిఎ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భాజపా నాయకులు వివాదాస్పద ప్రకటనలు చేయడం ఎక్కువైపోయింది.ముఖ్యంగా హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారు భాజపా నాయకులు.
సాధారణ హిందూ, ముస్లింలు ఎప్పుడూ సఖ్యతగానే ఉంటారు.కాని నాయకుల ప్రకటనలను ఆసరా చేసుకొని రెండు మతాల్లోని సంఘ విద్రోహ శక్తులు అరాచకాలు సృష్టించే అవకాశం ఉంది.
భాజపా నాయకులు ముస్లింలను దృష్టిలో పెట్టుకొనే ఒక్కోసారి ప్రత్యక్షంగా, మరోసారి పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇదివరకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లలను కనాలంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం రేపిన భాజపా ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి వివాదం రేకెత్తించారు.‘కుటుంబ నియంత్రణ పాటించకపోతే ఓటు హక్కు రద్దు చేయాలి’ అని ఓ ప్రకటన చేశారు.ముస్లింలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారని అందరికీ తెలుసు.
హిందువులు కుటుంబ నియంత్రణ చేయించుకుంటున్నారు కాబట్టి ముస్లింలు కూడా తప్పనిసరిగా కు.ని.ఆపరేషన్ చేయించుకోవాలన్నారు.చట్టం ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా అమలు కావాలన్నారు.‘ముస్లింలు, క్రిస్టియన్లు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని తాను చెప్పనని, అయితే చట్టం అనేది అందరికీ ఒకేవిధంగా వర్తించాలని అన్నారు.ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లలను కనాలని అన్నప్పుడు అందరూ గగ్గోలు పెట్టారని, వారు (ముస్లింలు) నలుగురు భార్యల ద్వారా నలభై మందిని కన్నా ఏమీ అనరని విమర్శించారు.
కుటుంబ నియంత్రణ పాటించకపోతే ఓటు హక్కు రద్దు చేయాలన్నారు.సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై ముస్లింలు ఎలా స్పందిస్తారో చూడాలి.