పొట్టచేతపట్టుకుని ఉపాది కోసం కువైట్ దేశానికి వలస కార్మికులుగా ఎంతో మంది భారతీయులు వలసలు వెళ్ళారు.లక్షలాది మంది భారతీయులు అక్కడే రేయింబవళ్ళు కష్టపడుతూ తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.
అయితే ప్రస్తుతం కువైట్ వెళ్ళే వారి సంఖ్య తగ్గిపోగా, కువైట్ లో ఉంటున్న భారతీయులు పెద్ద సంఖ్యలో భారత్ కు తిరిగి వచ్చేస్తున్నారు.కేవలం భారతీయులు మాత్రమే కాదు ఇతర దేశాల వలస కార్మికులు సైతం కువైట్ వద్దంటూ విడిచి వెళ్ళిపోతున్నారట.
గడిచిన మూడు నెలల కాలంలో దాదాపు 68 వేల మంది వలస వాసులు కువైట్ వీడిపోగా అందులో దాదాపు 22 వేల మంది భారతీయులు ఉండటం గమనార్హం.
కువైట్ ఉద్యోగాల కల్పనలో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, కువైట్ వాసులు వలస వాసులు చేసే పనులు తాము కూడా చేస్తామని ముందుకు రావడంతో వలస వాసుల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది.
ప్రభుత్వం సైతం స్థానికులకే ఉద్యోగాల కల్పన చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వలస వాసులకు ఉద్యోగాల విషయంలో కోతలు విధిస్తున్నారు.ఫలితంగా ఉద్యోగాలు కోల్పోయి, మరే ఇతర ఉద్యోగాలు దొరకక పోవడంతో ఎంతో మంది భారతీయులు వెనక్కి వచ్చేస్తున్నారు.
తాజా గణాంకాల ప్రకారం.
గడిచిన ఏడాది మార్చి మొదలు ఇప్పటి వరకూ సుమారు 2 లక్షల మంది వలస వాసులు కువైట్ విడిచి వెళ్లిపోయారని తెలుస్తోంది.
అయితే విదేశీ కార్మికులు వెళ్ళిపోవడం ద్వారా వారిపై ఆధారపడిన ఎన్నో సంస్థలు, వ్యాపారాలు, హోటల్స్, అన్నీ కుప్ప కూలుతున్నాయి.ముఖ్యంగా విదేశీ నిపుణులపై ఆధారపడిన హోటల్స్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది.
స్థానికంగా ఉన్న వారిలో నైపుణ్యం ఉన్న వారు లేకపోవడంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితిలో ఉన్నారు యజమానులు.ఈ పరిస్థితుల కారణంగా వర్కర్ల కు డిమాండ్ పెరిగిపోయింది.
కొందరైతే తాము తీసుకునే జీతంకంటే రెట్టింపు ఇస్తేనీ కాని పనిచేయమని తేల్చి చెప్పడంతో చేసేది లేక యాజమాన్యాలు రెట్టింపు జీతాలు చెల్లిస్తున్నాయి.