భారతీయ జనతా పార్టీ ఎంపీలు గర్వపడాలట….! ఎందుకు? ఎంపీలయ్యారనా? ఎంపీలై బాగా సంపాదించుకుంటున్నారనా? దేని కోసం గర్వపడాలి? దేని కోసమో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.కేంద్ర ప్రభుత్వం పనితీరు (పరిపాలన) బ్రహ్మాండంగా ఉందని, అది చూసి ఎంపీలంతా గర్వపడాలని మోదీ అన్నారు.భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ ‘స్వకుచ మర్దన’ సన్నివేశం చోటుచేసుకుంది.
భాజపా పాలనలో ఉన్న అన్ని రాష్ర్టాల్లో సర్కార్ల పనితీరు అద్భుతంగా ఉందని, నీతి నిజాయితీలతో పనిచేస్తున్నారని, ఏ తప్పూ చేయడంలేదని భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసలు కురిపించారు.నలభైఐదు నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తాను ఏ తప్పూ చేయలేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు.
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి తాను ఎటువంటి సహాయం చేయలేదన్నారు.తాను అతనికి ఆర్థిక సాయం చేయలేదని, ఇండియా నుంచి పారిపోవడానికి సాయపడలేదని చెప్పారు.లలిత్ మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇవ్వాలని తాను బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫార్సు చేయలేదన్నారు.వ్యాపం కుంభకోణానికి సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుష్మా సమర్ధించారు.
భాజపా ప్రధాన నేతలంతా సుష్మా స్వరాజ్ను వెనకేసుకొచ్చారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా తాము ‘కడిగిన ముత్యాల’మని చెప్పుకొచ్చారు.
భాజపా నాయకులంతా కలిసి కాంగ్రెస్ మీద విచుకుపడ్డారు.