ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనది.దేశ భవిష్యత్తును, పౌరుల భవితవ్యాన్ని నిర్ణయించేది ఓటే.
ఇక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో- ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించకపోయినా.చట్ట సభలకు ప్రతినిధులను ఎన్నుకునే హక్కు పౌరులకు ఉందని వివిధ కేసుల్లో కోర్టులు తీర్పు ఇచ్చాయి.
భారతదేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికీ లింగ, కుల, జాతి, మత భేదాలు లేకుండా పౌరులందరికీ ఓటు వేసే హక్కు ఉంది.అయితే ఉపాధి నిమిత్తం వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులకు మాత్రం వివిధ కారణాల వల్ల ఓటు వేసే సదుపాయం లేదు.
గణాంకాల ప్రకారం 210 దేశాల్లో మొత్తం 3.2 కోట్లమంది భారతీయులు నివసిస్తున్నారు.వీరిలో ప్రవాస భారతీయులే కాక, దశాబ్ధాల క్రితం విదేశాలకు వెళ్ళి స్థిరపడిన భారత సంతతి (పీఐఓ) ప్రజలూ ఉన్నారు.పీఐఓలకు ఆయా దేశాల పౌరసత్వం ఉంటుంది కాబట్టి వారు భారత్లో ఓటు వేయడానికి అనర్హులు.
కానీ, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఇంకా భారత పౌరులే కాబట్టి, 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 20ఎ కింద స్వదేశంలో ఓటు వేసే అర్హత ఉంటుంది.ఇందుకోసం వారు సంబంధిత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తమ పాస్పోర్టులో స్వస్థలంగా చూపిన ప్రదేశం ఏ నియోజకవర్గంలో ఉంటే అక్కడ ఓటు వేయవచ్చు.
ఇక త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్ఆర్ఐలు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిపాదనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సమ్మతించింది.ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) తాము నివసిస్తున్న దేశంలోనే ఉంటూ భారత దేశంలో జరిగే ఎన్నికల్లో ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపీబీఎస్) ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించేందుకు అంగీకరించింది.
ఎన్నికల సంఘం ప్రతిపాదనల ప్రకారం, పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలనుకునే ఎన్ఆర్ఐలు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి ఐదు రోజుల్లోగా ఫారం-12 ద్వారా రిటర్నింగ్ అధికారి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఎలక్ట్రానిక్ రూపంలో జారీ అవుతుంది.
పోస్టల్ బ్యాలెట్ను తగిన విధంగా నింపి, అధికారి చేత ధ్రువీకరణ పొంది, భారత దేశంలోని ఎన్ఆర్ఐ పాస్పోర్ట్లో చూపిన నియోజకవర్గపు రిటర్నింగ్ ఆఫీసర్కు పోస్టు ద్వారా పంపించాలి.ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరిగే రోజున ఉదయం 8 గంటల్లోగా చేరాలి.
దీంతో ఈ ఐదు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు సంబరాలు జరుపుకున్నారు.
కానీ వారి సంతోషం ఆవిరవ్వడానికి ఎంతో సేపు పట్టలేదు.త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విదేశాల్లో ఉంటున్న అర్హులైన ఎన్నారైలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు విషయమై కేంద్రం మళ్లీ నిరాశే మిగిల్చింది.ఈ విధానం అమలు చేయడంలో సవాళ్లను పరిష్కరించేందుకు సమయం పట్టే అవకాశం వుండటంతో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అందుబాటులో ఉండబోదని కేంద్రం తెలిపింది.
ఈ మేరకు బుధవారం లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.