అబుదాబి అంటే ఇస్లాం దేశం.ఎటు చూసినా మసీదులు, దర్గాలతో ఉండే ప్రాంతం.
అలాంటి చోట మొట్టమొదటిసారిగా ఓ హిందు దేవాలయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.దీని నిర్మాణంలో ఎక్కడా ఉక్కు, ఫెర్రస్ వంటి పదార్థాలను ఉపయోగించుకుండా భారతదేశంలో దేవాలయాల తరహాలోనే నిర్వాహకులు నిర్మిస్తున్నారు.
గ్రౌండ్ బ్రేకింగ్ జరిగిన రెండు సంవత్సరాల తర్వాత కాంక్రీటుతో రాఫ్ట్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి యూఏఈలో స్థిరపడిన ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సాధారణంగా ఏదైనా భవనానికి కాంక్రీట్, ఉక్కు మిశ్రమంతో పునాదులు వేస్తారు.అయితే భారతదేశంలో సాంప్రదాయ ఆలయ నిర్మాణంలో ఉక్కు, ఇనుప చువ్వలను ఉపయోగించరని అదే ఆనవాయితీని ఈ ఆలయ నిర్మాణంలోనూ కొనసాగిస్తున్నట్లు స్వామి నారాయణ్ టెంపుల్ కమిటీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.
ఈ ఆలయ నిర్మాణానికి గతేడాది ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు.బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్ సంస్థ అబుదాబి- దుబాయ్ హైవేకు సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
ఇందుకోసం యూఏఈ ప్రభుత్వం 55 వేల చదరపు మీటర్ల స్థలాన్ని ఉచితంగా అందిస్తుంది.ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుడు, అయ్యప్ప ఆలయాలు ఉంటాయి.అంతేకాకుండా ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల, గార్డెన్, క్రీడా మైదానం, గిఫ్ట్ షాప్స్, ప్రార్థన మందిరాలు, బోధన శాలలు, సందర్శన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
భారత్తో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఆఫ్రికా దేశాల్లో 1,200 దేవాలయాలను బొచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణన్ సంస్థ నిర్వహిస్తోంది.భారతదేశానికి చెందిన సుమారు 3 వేల మంది హస్తకళాకారులు, శిల్పులు ఈ ఆలయ నిర్మాణంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.5,000 టన్నుల ఇటాలియన్ కారారా మార్బుల్తో కొన్ని చిహ్నాలు, విగ్రహాలను చెక్కారు.అలాగే వెలుపలి వైపు భాగాలను 12,250 టన్నుల పింక్ సాండ్ స్టోన్తో చెక్కుతున్నారు.
యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒమర్ అల్ ముత్తన్న మాట్లాడుతూ… మతం అనేది ఇంటికి అతి ముఖ్యమైనదన్నారు.యూఏఈని ప్రతి ఒక్కరూ సొంత ఇల్లులా ఫీలవ్వాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.