లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద ప్రస్తుతం పరారీ లో ఉన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయనపై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసి ఆయన ఆచూకీ చెప్పాలి అంటూ ప్రపంచ దేశాలను కోరింది.
అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద గత ఏడాది పాస్పోర్టు లేకుండానే భారత దేశం నుంచి వెళ్ళిపోయారు.నిత్యానందపై గుజరాత్, కర్ణాటకలలో అత్యాచారం, అపహరణ కేసులు నమోదైన నేపథ్యంలో ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేసింది.
అయితే ఇటీవల కొన్ని వీడియోల్లో నిత్యానంద కనిపించాడు.ఈక్వెడార్లో కైలాసాన్ని నిర్మించనున్నట్లు ఓ వీడియోలో నిత్యానంద చెప్పారు.
దీంతో వివాదం ముదిరింది.అయితే అతను ఈక్వెడార్లో లేరని, హైతీకి పారిపోయినట్లు ఈక్వెడార్ ఎంబసీ స్పష్టం చేసింది.
ఓ దీవిని కొని, దానికి కైలాసం అని నిత్యానంద పేరుపెట్టిన అంశాన్ని ఈక్వెడార్ కొట్టిపారేసింది.మరోపక్క గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని నిత్యానంద ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమవడంతో గత ఏడాది నవంబరులో ఆయనపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదైంది.
చిన్న పిల్లలను అహ్మదాబాద్ ఆశ్రమంలో బంధించి.లైంగికంగా వేధించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు స్థానిక కోర్టులో ఓ అభియోగపత్రాన్నికూడా దాఖలు చేశారు.ప్రస్తుతం ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కృషి జరుగుతుంది.
ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసులు గనుక జారీ అయితే నిత్యానంద ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట.గతంలో కూడా నిత్యానంద పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.