బీహార్ లో రెండో దశ పోలింగ్ ఈ రోజు జరుగుతుంది.రెండో దశ పోలింగ్ లో భాగంగా మంగళవారం 94 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే.
ఈ సెకండ్ పేజ్ లో మొత్తం 1464 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.ముఖ్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలోని ఏడుగురు మంత్రులు, కాంగ్రెస్ నుంచి సినీ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా కూడా బరిలో ఉండడం తో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
ఇక 10 రాష్ట్రాల్లో 54 స్థానాలకు ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి.బీహార్ ఎన్నికల రెండవ విడత పోలింగ్ సందర్భంగా మంగళవారం చిరాగ్ పాస్వాన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ… నితీష్ కుమార్ మరలా ముఖ్యమంత్రి కాలేరని తాను లిఖితపూర్వకంగా ఇవ్వగలను అంటూ జోస్యం చెప్పారు.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుండి వేరుపడి సొంతగా పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపి)… బిజెపితో మాత్రం పోత్తు చెక్కుచెదరకుండా ఉందని ఆయన నొక్కిచెప్పారు.
అంతేకాకుండా మొదటి దశ పోలింగ్ తరువాత, నితీష్ లో ఓటమి భయం మొదలైందని, ప్రజలు ఆయనను తిరస్కరించారని, నితీష్ కు ఓటు వేసి తమ ఓటు వృధా చేసుకోవద్దని ఈ సందర్భంగా చిరాగ్ విజ్ఞప్తి చేశారు.గత 15 సంవత్సరాల్లో బీహార్ అపఖ్యాతి పాలైందని, దారుణమైన స్థితికి చేరుకుందని, వలసలు, నిరుద్యోగం, వరద సహాయంలో ఎటువంటి మెరుగుదల లేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, బీహార్ ఎన్నికల తొలివిడత పోలింగ్ అక్టోబర్ 28న జరగ్గా, నేడు రెండో విడత పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.అలానే చివరి విడత పోలింగ్ కూడా శనివారం జరుగనుండగా, నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించనున్నారు.
అలానే మధ్యప్రదేశ్ లో 28, యూపీలో 7, ఒడిశా, నాగాలాండ్,కర్నాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో 2 సీట్ల చొప్పున, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బైపోల్స్ జరుగుతున్నాయి.