భారతదేశంలో ఎన్నారైలకు పన్ను విధించాలన్న కేంద్ర బడ్జెట్ 2020పై మారిటైమ్ యూనియన్స్ భగ్గుమన్నాయి.దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి తమ నిరసన తెలియజేస్తామని తెలిపాయి.
ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ వంటి దేశాలు సముద్రయానదారుల విషయంలో ప్రపంచ వాటా కోసం భారతదేశంతో పోటీ పడుతున్నాయి.కానీ వారు తమ సముద్రయానదారులపై అధిక మొత్తంలో ఆదాయపు పన్ను విధించరని మారిటైమ్ యూనియన్లు తెలిపాయి.
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పన్ను విధించిన దాఖలాలు లేవని మారిటైమ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎంయుఐ), నేషనల్ యూనియన్ ఆఫ్ సీఫరర్స్ ఆఫ్ ఇండియా (ఎన్యుసీఐ) సంయుక్త ప్రకటనలో తెలిపాయి.ఆదాయపు పన్ను చట్టంలో ప్రతిపాదిత మార్పుకు వ్యతిరేకంగా బలమైన నిరసన కార్యక్రమానికి తాము సిద్ధమవుతున్నట్లు సంఘాలు వెల్లడించాయి.
అలాగే ఎన్ఆర్ఐ అన్న పదానికి కొత్త నిర్వచనం ఇచ్చేలా భారతదేశంలో ఉండే కాలం 181 నుంచి 120 రోజులకు తగ్గించగా, అలాగే భారత్కు వెలుపల 183 రోజులను 245 రోజులకు పెంచారు.కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా తాము దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని యూనియన్ ప్రధాన కార్యదర్శి అబ్ధుల్గనీ సెరాంట్ వెల్లడించారు.ఎన్యూసీఐ సభ్యులందరూ సంతకం చేసిన నిరసన లేఖలను సేకరించడం తాము ఇప్పటికే ప్రారంభించామని, వాటిని కొద్దిరోజుల్లోనే ఆర్ధిక, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ రెండింటికి సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదన భారత నౌక వాణిజ్య వృద్ధిని అడ్డుకుంటుందని, ఇక నుంచి భారతీయులను నౌకా వాణిజ్యంలోకి ఆకర్షించడం చాలా కష్టమవుతుందని ఎంయూఐ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
తాజా వార్తలు