పైకి చడీచప్పుడు లేకపోయినా, కేంద్ర అధికార పార్టీ బిజెపి ఏపీ రాజకీయాల విషయంలో చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని చూస్తున్నా, అందుకు తగ్గ అవకాశం, సమర్థులైన నాయకుల కొరత, పార్టీని ముందుండి నడిపించి క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులు లేకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఏపీలో బిజెపి సొంతంగా ఎదగలేక పోతుంది.
ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని 12 సీట్లు సాధించడం మినహా బీజేపీ ప్రభావం ఏపీలో పెద్దగా లేదు.కేవలం పట్టణ స్థాయి వరకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయిపోగా, గ్రామ స్థాయి లో అసలు బీజేపీ ఉనికే లేదు.2024 ఎన్నికల నాటికి బాగా బలపడి అధికారం దక్కించుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీతో ఇప్పటికే పొత్తు పెట్టుకుంది.
పవన్ పేస్ వ్యాల్యూ తో పాటు, కోట్లాది మంది అభిమానుల అండదండలు బిజెపికి దక్కితే, అధికారం సాధించడం సులభం అవుతుందని అంచనాల్లో ఉంది.
ఇది ఇలా ఉంటే బిజెపి ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్టుగా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లోకి బిజెపి నాయకులు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ను దించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
పవన్ తో పొత్తు పెట్టుకున్నా, ఆయన సీఎం కుర్చీ పై ఆశలు పెట్టుకున్నారని, చివర్లో సీయం కుర్చీ దగ్గర కూడా పేచీ వచ్చే అవకాశం ఉండడం వంటివి పరిగణలోకి తీసుకుంటున్నారు బీజేపీ పెద్దలు.
ఇప్పుడు తమిళనాడుకు చెందిన తెలుగింటి కోడలు నిర్మల సీతారామన్ ను ఏపీ రాజకీయాల్లోకి దించి ఆమె ద్వారా పార్టీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకు రావాలని ఇప్పటి నుంచి నిర్మల సీతారామన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి, క్షేత్ర స్థాయిలో బలోపేతం అవ్వాలని బిజెపి అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం అధికార పార్టీ వైసిపి దూకుడుగా ఉన్న తీరు చూస్తుంటే, 2024 ఎన్నికల నాటికి టిడిపి పరిస్థితి మరింతగా దిగజారుతుందని, అప్పుడు వైసిపి వర్సెస్ బిజెపి అన్నట్టుగానే పరిస్థితి ఉంటుందని, టిడిపి బలమంతా బిజెపి కి వచ్చి చేరుతుందని, అప్పుడు సులువుగా అధికారం చేపట్ట వచ్చనే అభిప్రాయంతో బీజేపీ అగ్రనేతలు ఇప్పుడు నిర్మలా సీతారామన్ పేరును ప్రకటించి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది.ఒకవేళ అదే కనుక నిజమైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటనేది మరో ప్రశ్న.