ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.రాజకీయ పార్టీల మధ్య ఇప్పుడు ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి ఎంపీ సుజనా చౌదరి , ఏపీ మాజీ మంత్రి బిజెపి నాయకుడు కామినేని శ్రీనివాస రావు ఈ ముగ్గురు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో రహస్యంగా ఈనెల 13వ తారీఖున భేటీ అయినట్టుగా, సీసీ టీవీ ఫుటేజ్ బయటకు రావడంతో పెద్ద కలకలమే రేగిన సంగతి తెలిసిందే.అసలు వీరు అంత రహస్యంగా బేటీ అవ్వడం వెనుక కారణాలు ఏంటనే దానిపై పెద్ద రాద్దాంతం జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం గతంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఈసీ పదవి నుంచి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలగించి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి కనగ రాజు అనే వ్యక్తిని నియమించింది.
దీని పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లడం, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం , దాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ఇలా పెద్ద తతంగమే జరిగింది.ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు లో ఉంది.ఇది ఇలా ఉండగానే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నాయకులు, చంద్రబాబు కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస రావు తో భేటీ అవ్వడం పై వైసిపి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది.
దీనికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది.ఇదిలా ఉంటే ఈ భేటీ టిడిపి అధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని, ఈ ముగ్గురు భేటీ అయిన తర్వాత చంద్రబాబు వీడియో కాల్ మాట్లాడారని, వైసీపీ ఆరోపణలు చేస్తోంది .
అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా త్వరలో బయట పెడతాము అంటూ విజయ్ సాయి రెడ్డి చెబుతుండడం సంచలనంగా మారింది.త్వరలోనే ఈ వీడియోను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు గా పేర్కొనడంతో ఈ వ్యవహారం మరింత ముదిరే లా కనిపిస్తోంది.గతంలోనే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.ఇప్పుడు కూడా వైసిపి కనుక ఈ భేటీకి సంబంధించిన పూర్తి ఆధారాలతో వీడియోను బయటకు విడుదల చేస్తే , చంద్రబాబుతో పాటు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ , సుజనా చౌదరి వంటి వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
రాజకీయంగా అవి వారికి ఇబ్బందికర పరిణామమే.ఇక ఈ అంశం వైసీపీకి బాగా కలిసి వస్తుంది.ఎందుకంటే గతం నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసిపి మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.