ఏపీ ఎన్నికల అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది.ఏపీ ఎన్నికల అధికారిగా ఆయనను తప్పించి, మరో వ్యక్తిని నియమించిన వ్యవహారంపై ఆయన కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన విధుల్లో చేరేందుకు కోర్టు అనుమతించిన ప్రభుత్వం సహకరించడం లేదంటూ ఆయన మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు.దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం నిమ్మగడ్డ విధుల్లో చేరేందుకు ఓ సూచన చేసింది.
తాను విధుల్లో చేరేందుకు సహకరించాలని ఒక విజ్ఞాపన పత్రంతో నేరుగా గవర్నర్ ని కలవాలంటూ సూచించింది.ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం పై పూర్తిగా గవర్నర్ కు అధికారాలు ఉంటాయని స్పష్టంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మూడు సార్లు ఇదే విషయం పై సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే లభించలేదని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.దాని కారణంగానే హైకోర్టు ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును హైకోర్టు ధర్మాసనం తప్పు పట్టడమే కాకుండా, నోటీసులు జారీ చేసింది.దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టే నిమిత్తం ఈ కేసుని వచ్చే శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలిపింది.
దీంతో ఏపీ ప్రభుత్వం కోర్టు దగ్గర చిక్కులు ఎదుర్కునే అవకాశం లేకపోలేదు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.గతంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్సు ను కోర్టు కొట్టివేసింది.
ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారంలో న్యాయపరమైన వివాదాలు వస్తూనే ఉన్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మగడ్డను ఎన్నికల అధికారిగా విధుల్లో చేరకుండా చూడాలనే ఉద్దేశంతో వైసిపి ప్రభుత్వం ఉండగా, ఆయన మాత్రం ఏపీ లోనే మళ్లీ ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించాలనే పంతంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.ప్రస్తుతం ఈ వ్యవహారంలో హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించడంతో ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందించాలో తెలియక ఏపీ ప్రభుత్వం సతమతం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.
హైకోర్టు సూచనలపై ఏపీ ప్రభుత్వం ఇప్పుడు న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై ముందుకు వెళ్లాలని చూస్తోంది.ఒక వేళ నిమ్మగడ్డ విధుల్లో చేరేందుకు గవర్నర్ అంగీకారం తెలిపితే ఏపీ ప్రభుత్వంకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే.