భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభిస్తోంది.
అయితే రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తర్వాతి నుంచి పరిస్థితులు మారిపోయాయి.రైతుల ఆందోళన ముసుగులో ఖలీస్తానీ వేర్పాటు వాదులు దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారంటూ నిఘా వర్గాలు సంచలన నివేదికను బయటపెట్టాయి.
దీనికి తోడు రైతులకు మద్ధతుగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ ట్వీట్ చేసిన ‘‘టూల్ కిట్ ’’ వ్యవహారం అప్పట్లో దేశ రాజకీయాలను వేడెక్కించింది.
రైతుల ఆందోళనకు మద్ధతుగా కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాలలో కొందరు ఖలీస్తానీ వేర్పాటు వాదులు ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు.
అయితే వారికి పోటీగా కెనడాలోని కొందరు ప్రవాసులు భారతదేశ ఐక్యత కోసం ర్యాలీలు నిర్వహిస్తున్నారు.ఇది కొందరు ఖలిస్తానీయులకు కంటగింపుగా మారింది.దీంతో మీపై అత్యాచారంతో పాటు హింసాత్మక చర్యలకు పాల్పడతామని, వ్యాపారాలను దెబ్బతీస్తామంటూ కెనడాలోని భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులను కొందరు ఆగంతకులు బెదిరించారు కూడా.అయితే భారతదేశ భద్రతను దృష్టిలో వుంచుకుని ఖలిస్తాన్ గ్రూపులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫోకస్ పెట్టింది.
దీనిలో భాగంగా ఖలిస్తాన్ గ్రూపులు బలంగా వున్న కెనడాకు ముగ్గురు సభ్యుల ఎన్ఐఏ బృందం వెళ్లింది.ఈ గ్రూపులకు నిధులు వచ్చే మార్గాలపై నాలుగు రోజుల పాటు ఈ టీమ్ దర్యాప్తు చేయనుంది.
ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఎన్ఐఏ బృందం. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే), బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ (కేజడ్ఎఫ్) , ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) వంటి గ్రూపులకు సంబంధించి దర్యాప్తులో కనుగొన్న విషయాలను కెనడా అధికారులతో చర్చించనుంది.
భారత వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా పంచుకోవడంతో పాటు పరస్పర చట్టపరమైన సహాయ ఒప్పందాన్ని అమలు చేయాలని ఎన్ఐఏ బృందం కెనడాపై ఒత్తిడి చేసే అవకాశం వుంది.కెనడాతో పాటు యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీల నుంచి ఖలిస్తాన్ గ్రూపులకు అందుతున్న నిధుల వివరాలను ఎన్ఐఏ ఇప్పటికే సేకరించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీలో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన మార్చ్ సందర్భంగా ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగురవేసిన వారికి ఎస్ఎఫ్జే 2.5 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.85 కోట్లు) బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా.గతేడాది ఎస్ఎఫ్జే నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ, కేటీఎఫ్ నేత పరమ్జిత్ సింగ్ పమ్మా, హర్దీప్ సింగ్ నిర్జర్లను భారత ప్రభుత్వం తీవ్రవాదులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎస్ఎఫ్జే, బీకేఐ, కేటీఎఫ్, కేజడ్ఎఫ్ వంటి ఖలిస్తానీ సంస్థలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.ఈ కుట్రల కోసం యూఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఖలిస్తానీ గ్రూప్లకు భారీగా నిధులు అందుతున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.