ఈ ఏడాది భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత జాతీయ పతాకానికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కనుంది.ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది.
అగ్రరాజ్యంలో ప్రవాస భారతీయుల తరపున ప్రాతినిథ్యం వహిస్తోన్న భారతీయ సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఏ) ప్రతినిధులు మన జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమాన్ని ఎఫ్ఐఏకు చెందిన అధికారిక సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల భారతీయ సంఘాల సమాఖ్య ప్రతినిధులు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి అవసరమైన అనుమతులను తీసుకుంటున్నారు.
ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తాము ఈసారి చరిత్ర సృష్టించబోతున్నామని ఎఫ్ఐఏ ప్రతినిధులు వెల్లడించారు.ఈ కార్యక్రామానికి అమెరికాలో భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైస్వాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కరోనా క్లిష్టపరిస్థితుల్లోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావడానికి అమెరికన్ పౌరులు కూడా ఆసక్తిగా ఉన్నారని ఎఫ్ఐఏ ప్రతినిధులు వెల్లడించారు.టైమ్స్ స్క్వేర్ సమీపంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్పై జాతీయ పతకంలోని రంగులను డిస్ప్లే చేస్తామని, లేజర్ ద్వారా వాటిని ప్రతిఫలింపజేస్తామని వారు చెప్పారు.
ఇండియన్- అమెరికన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేస్తామని అన్నారు.కాగా, ఎఫ్ఏఐ ప్రతిఏటా ఇండియా పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ వేడుకల్లో అమెరికా రాజకీయ నాయకులు, శాసనసభ్యులు, ప్రముఖులు పాల్గొంటారు.అయితే ఈసారి కోవిడ్ కారణంగా కార్యక్రమ నిర్వహణకు ఆటంకం ఏర్పడింది.