దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి భీభత్సం సృష్టిస్తున్న విషయం విదితమే.ఏపీ లో ముఖ్యంగా ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
ఈ కరోనా కు చిన్న వయసు వారు సైతం ప్రాణాలు కోల్పోతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.తాజాగా ఏపీ లో ఇక నవ వరుడు కోవిడ్ కాటుకు బలైపోయాడు.
ఇప్పటివరకు ఏపీ లో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా నమోదు కాగా, 2 వేలమందికి పైగా మృతి చెందారు.ఏపీ లో చోటుచేసుకున్న ఈ తాజా ఘటన అందరిని కలచివేసింది.
పెళ్లై ఇంకా వధువు కాళ్ల పారాణి ఆరకముందే కేవలం 10 రోజుల్లోనే కన్నుమూసిన ఘటన తీవ్ర విషాదం నింపింది.చిత్తూరు జిల్లా వి.కోట మండలం నెర్నిపల్లి లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే….
గ్రామానికి చెందిన ఓ యువకుడికి పది రోజుల క్రితమే వివాహం జరిగింది.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బంధు మిత్రుల సమక్షంలో అతడి పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది.
అయితే పెళ్లి తరువాత అతడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అవ్వడం తో వెంటనే బెంగుళూరు లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ క్రమంలో అతడి ఆరోగ్యం విషమించి గురువారం ఉదయం కన్నుమూయడం తో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కనీసం కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఇలాంటి ఘోర ఘటన చోటుచేసుకోవడం తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.