ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా యాప్ ల ద్వారా పరిచయాలు పెంచుకుని ప్రేమలో పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.కొందరు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుంటున్నారు.
అయితే ఇలా పెళ్లి చేసుకున్న వాళ్లలో కొందరు కలకాలం సంతోషంగా జీవిస్తుంటే కొన్ని జంటలు మాత్రం విషాదంతో జీవితాలను ముగిస్తున్నాయి.తాజాగా గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా బెల్లం కొండ ప్రాంతంలో ఇటీవల పెళ్లి చేసుకున్న పవన్, శైలజ ఆత్మహత్య చేసుకున్నారు.పెద్దల బెదిరింపులను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.పూర్తి వివరాల్లోకి వెళితే గుంటూరులోని మంగళగిరి ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ కు తిరుపతికి చెందిన శైలజకు టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. పవన్, శైలజ ఒకరినొకరు ఇష్టపడి గత నెల 3వ తేదీన తిరుపతిలో వివాహం చేసుకున్నారు.
ఆ తరువాత పెద్దలకు దొరకకుండా మాచాయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్లో కొంతకాలం నుంచి తలదాచుకున్నారు.శైలజ తల్లిదండ్రులకు పవన్ తో వివాహం ఇష్టం లేకపోవడంతో పవన్ ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో భయాందోళనకు గురైన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.తన తల్లి బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నామని శైలజ సూసైడ్ నోట్ లో పేర్కొంది.
ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకోగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పవన్, శైలజ ఆత్మహత్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నవ దంపతుల ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.