విధి చాలా విచిత్రమైనది.ఎవరు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ చనిపోతారో ఎవరికి తెలియదు.
కోటి ఆశలతో పెళ్లి పీటలు ఎక్కి రంగుల ప్రపంచాన్ని ఊహించుకుంటూ కట్టుకున్నవాడి తో ఎడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్న ఓ యువ జంట ఆశలపై విధి నీళ్లు చల్లింది.రోడ్డు ప్రమాదంలో వాళ్ళని బలితీసుకుంది.
పెళ్లయి అత్తవారింట్లో అడుగు పెట్టాల్సిన వధువు రక్తపు మడుగులో కొట్టిమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది.మీ కూతుర్ని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా అని మాటిచ్చి ఇంటికి బయలుదేరిన వరుడు అందరి కళ్లెదుటే ప్రాణాలు విడిచాడు.
ఈ హృదయవిధారకరమైన ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల నేషనల్ హైవే పై జరిగింది.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ యడ్లపల్లి వెంకటేష్, ఆలపాటి మానస నవ్య ఇద్దరూ.
ఈనెల 14న ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నారు.తెనాలి సమీపంలోని గోవాడ గ్రామంలో నవ్య ఇంటివద్దనే మూడు రోజులు ఆనందంగా గడిపారు.
తమ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళిక వేసుకున్నారు.భర్త వెంకటేష్ ఇంటికి విశాఖపట్నం జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరారు.
భీమడోలు సమీపానికి వచ్చేసరికి కారు డివైడర్ను ఢీకొట్టి ఆవలి వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది.నవ దంపతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఈ ప్రమాదంలో నవజంటతో పాటు డ్రైవర్ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులకు స్పష్టత రాలేదు.
కారు డ్రైవర్ కునుకుతీయడంతో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందా, లేక మరేదైనా కారణమా అనేది నిర్ధారణ కావలసి ఉంది.కారు టైర్ పంక్చర్ కావటంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి ఆవలి వైపుకు వెళ్లి లారీని ఢీకొట్టి ఉండవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు.