ఏదైనా విపత్తు లేదా ప్రమాదం ఎదురైనప్పుడు దాని నుంచి గుణపాఠం నేర్చుకోవడంలోనూ , మరోసారి ఎలాంటి ఉపద్రవానికి తావు ఇవ్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టడంలోనూ న్యూజిలాండ్ ముందుంటుంది.కరోనా మహమ్మారిని అద్భుతంగా నిలువరించి ప్రపంచ దేశాల మన్ననలు పొందింది ఈ చిన్న దేశం.
తొలి విడత కరోనా వెలుగు చూసిన 2020 మార్చి నుంచి న్యూజిలాండ్ అంతర్జాతీయ సరిహద్దును మూసివేసిన సంగతి తెలిసిందే.నాటి నుంచి ఇదే వైఖరిని అవలంభిస్తూ కట్టుదిట్టమైన చర్యల ద్వారా ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కరోనాను కట్టడి చేసి ప్రశంసలు పొందారు.
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలోనూ దానిని కట్టడి చేసేందుకు ఆమె పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పుడు ఏకంగా కోవిడ్ కోసం తన పెళ్లినే వాయిదా వేసుకున్నారు జెసిండా ఆర్డెర్న్.
న్యూజిలాండ్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశంలో ఆంక్షలను కఠినతరం చేశారు.పాలకులు ఎప్పుడూ ఆచరించి చూపాలని… ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాను ఈ పరిస్ధితుల్లో పెళ్లి చేసుకోలేనని భావించిన జెసిండా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏకంగా తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
క్లార్క్ గేఫోర్డ్తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోన్న ఆర్డెర్న్.త్వరలో పెళ్లి పీటలు ఎక్కాలని భావిస్తున్నారు.కానీ తమ వివాహ తేదీని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
అయితే కొద్దిరోజుల్లోనే జెసిండా తన ప్రియుడిని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తున్నది.ఇదే సమయంలో దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించకతప్పడం లేదని .అందుకు తనను క్షమించాలని ప్రధాని కోరారు.
కాగా.
ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థల్లో, షాపింగ్ మాల్స్లో మాస్కులు తప్పనిసరి చేశారు.అలాగే వివాహాది శుభకార్యాలకు హాజరయ్యే వారిపైనా పరిమితులు విధించారు.
వేడుకలకు వంద మందికి మాత్రమే అనుమతించారు.ఈ ఆంక్షలు వచ్చే ఫిబ్రవరి నెలాఖరు వరకు అమల్లో ఉండనున్నాయి.మరోవైపు దేశంలో 12 ఏళ్లు దాటిన వారిలో 93 శాతం మంది పూర్తిగా టీకాలు తీసుకున్నారు.52 శాతం మంది బూస్టర్ డోస్ను తీసుకున్నారు.దీనితో పాటు 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కూడా న్యూజిలాండ్ ప్రభుత్వం టీకాలు వేయడం ప్రారంభించింది.