వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని దశ దిశలా వ్యాప్తి చేస్తున్నారు.మన పండుగలు, ఆచారా వ్యవహారాలను అనుసరిస్తూ పాశ్చాత్యులకు సైతం అలవాటు చేస్తున్నారు.
ఇందులో సంగీతం కూడా ఒకటి.ఎంతోమంది సంగీతకారులు వివిధ దేశాల్లో స్థిరపడి తమ ప్రతిభతో దేశానికి వన్నెతెస్తున్నారు.
ఇందులో పార్తాప్ బ్రదర్స్ కూడా ఒకరు.భారతీయ శాస్త్రీయ సంగీతంలోని గుర్మత్ సంగీతాన్ని దేవీందర్, మోహిందర్, రవీందర్లు సంరక్షిస్తున్నారు.
తమ అద్భుతమైన కళతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇదే సమయంలో మోహిందర్ పార్తాప్ సింగ్ కుమారుడు న్యూయార్క్లో స్థిరపడిన కబీర్ పార్తాప్ తన తండ్రి, గుర్మత్ సంగీతం గొప్పదనం, అమ్మానాన్నల నాలుగు దశాబ్ధాల ప్రస్థానాన్ని వివరించే డాక్యుమెంటరీ సిరీస్ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.
కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మోహిందర్ మరణించడంతో.అప్పుడే కబీర్కు గుర్మత్ సంగీతం యొక్క గొప్పదనం తెలిసింది.ఈ నేపథ్యంలో తన తండ్రితో పాటు గుర్మత్ సంగీతం గురించి డాక్యుమెంటరీలో వివరించాలని నిర్ణయించుకున్నాడు.ప్రస్తుతం ఇది ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో వుంది.
భావోద్వేగాలు, రియాలిటీ, ప్రత్యేకమైన అంశాలను మిళితం చేసి దీనిని తెరకెక్కిస్తున్నారు.ఈ డాక్యుమెంటరీని తొలుత ఇంగ్లీష్లో రిలీజ్ చేసి తర్వాత పంజాబీ, హిందీ, ఉర్దూలోకి అనువాదం చేయనున్నారు.
ఈ సందర్భంగా కబీర్ మాట్లాడుతూ.ఇది మనందరితో ప్రతిధ్వనించే కథ.ఇది మన దైనందిన జీవితంలో ఎదురయ్యే పరీక్షలు, కష్టాలపై దృష్టి పెడుతుందని చెప్పారు.కుటుంబం పోరాటం, రాజకీయంగా, సామాజికంగా మనల్ని వ్యక్తిగతంగా ప్రభావితం చేసే సంఘటనలు, మన ఆత్మీయుల అంచనాలు డాక్యుమెంటరీలో పొందు పరిచామన్నారు.
మోహిందర్ సోదరుడు రవీందర్ పార్తాప్ మాట్లాడుతూ.ఈ డాక్యుమెంటరీ.శాస్త్రీయమైన గుర్మత్ సంగీత సంపదను సంరక్షించడానికి ప్రేరణ కల్పిస్తుందని ఆకాంక్షించారు.దీనిని చూసిన తర్వాత కీర్తనలపై ఆసక్తివున్న కొత్త తరం.ప్రశ్నలతో తమను సంప్రదిస్తుందని ఆశిస్తున్నట్లు రవీందర్ చెప్పారు.
దేవిందర్ పార్తాప్ మాట్లాడుతూ.మోహిందర్ వేదికపై నైపుణ్యాన్ని ప్రదర్శించేవాడని అతను లేకుండా తాము ఎప్పటికీ సంపూర్ణంగా ఉండలేమన్నారు.అతనిని గర్వపడేలా చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు.
సంగీతం పట్ల ముక్కువే మా ముగ్గురు సోదరులను నడిపించిందని రవీందర్ చెప్పారు.నేడు శాస్త్రీయ సంగీతాన్ని సజీవంగా వుంచడంలో వున్న ఇబ్బందుల గురించి పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తమ కమ్యూనిటీలోని తల్లిదండ్రులు ఇకనైనా వారి పిల్లలను గుర్మత్ సంగీతాన్ని అభ్యసించడానికి ప్రోత్సహిస్తారని వారు ఆకాంక్షించారు.సోషల్ మీడియా, స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా వున్న శాస్త్రీయ సంగీత అభిమానులు ఒక చోట చేరడానికి వేదిక ఏర్పడిందని దేవిందర్ అన్నారు.