అమెరికాలో శాశ్వత పౌరసత్వాన్ని సంపాదించాలని చాలా మంది కలలు కంటారు.ఇందుకు వీలు కల్పించే గ్రీన్కార్డుల కోసం పలు ప్రయత్నాలు చేస్తారు.
అయితే అక్కడ అధ్యక్షుడు మారినప్పుడల్లా ఈ విషయంలో సరికొత్త నిబంధనలు తెరపైకి వస్తుంటాయి.ఎన్నడూ లేని విధంగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల కాలంలో ఇమ్మిగ్రేషన్లో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు.
గ్రీన్కార్డు సాధనకు రాచమార్గంగా భావించే ‘హెచ్ 1బీ’ వీసాల జారీని ఈ ఏడాది చివరివరకూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ట్రంప్.భారతీయులు సహా విదేశీయుల ఆశలపై నీళ్లు చల్లారు.
అయినప్పటికీ, కొందరు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు.అయితే తాజా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
కానీ పదవిలోంచి వెళుతూ… వెళుతూ ఆయన మరో విదేశీయులకు షాకిచ్చే నిర్ణయాన్ని తీసుకున్నారు.
అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు నిర్వహించే అర్హత పరీక్షా విధానాన్ని సవరించినట్టు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఇటీవల ప్రకటించింది.
మౌఖిక రూపంలో ఉండే ఈ పరీక్ష తయారీలో భాగంగా అభ్యర్థులు అమెరికాను గురించి మరింత సమగ్రంగా తెలుసుకునే వీలు కలుగుతుందని అధికారులు వివరించారు.కొంతకాలం పాత, కొత్త విధానాలులు రెండూ అమలులో ఉంటాయని.
డిసెంబర్ 1 నుంచి దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు కొత్త విధానంలో పరీక్షను నిర్వహిస్తామని వారు వివరించారు.ఈ అర్హత పరీక్షలో ఇంగ్లిష్, పౌరశాస్త్రానికి సంబంధించిన రెండు భాగాలుంటాయి.
కాగా, ఇంగ్లీషు విభాగంలో ఏ మార్పులేదని అధికారులు వివరించారు.
అమెరికా పౌరసత్వం మౌఖిక పరీక్షలో 2008 నుంచి ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వం, చరిత్ర, భౌగోళిక స్వరూపం, పౌరుల హక్కులు-విధులు వంటి అంశాలపై 100 ప్రశ్నలు ఉండేవి.
ప్రతి 10 ప్రశ్నల్లో ఆరింటికి సరైన సమాధానం చెప్పాలనే నిబంధన ఉంది.తాజాగా, ఆ ప్రశ్నల సంఖ్యను 128కి పెంచారు.డిసెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పరీక్షలో ప్రతి 20 ప్రశ్నల్లో పన్నెండింటికి సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసిన యూఎస్సీఐఎస్ కొన్ని కీలక ప్రశ్నలకు ఐచ్ఛికాలను కూడా తొలగించింది.
అయితే, ప్రశ్నలు సంఖ్య పెరిగినా.అర్హత మార్కులు మాత్రం 60 శాతమే.
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.65 లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు, కనీసం 20 సంవత్సరాల చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కలిగిన వ్యక్తులకు పౌరసత్వం లభిస్తుంది.ఈ దరఖాస్తుదారులు 10 ప్రశ్నలు అడిగితే ఇందులో 60 శాతం స్కోర్ సాధించాలి.
తాజా మార్పుల వల్ల పౌరసత్వ మౌఖిక పరీక్ష మరింత కఠినతరమవుతుందని, రాజకీయ రంగును పులుముకుంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా అమెరికా పౌరసత్వాన్ని పొందే విదేశీయుల్లో భారతీయులు సంఖ్యాపరంగా రెండో స్థానంలో ఉన్నారు. 2019 సెప్టెంబరు 30తో పూర్తయిన 12 నెలల కాలంలో 61,843 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది.ఆ సమయంలో అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో ఇది 7.5 శాతం.అంతకు ముందు ఏడాది 52,194 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం దక్కించుకున్నారు.ఇది మొత్తం విదేశీయుల్లో 6.5 శాతంగా ఉంది.