తొందరపాటు లో నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు పెద్దలు.ఎలాంటి విషయంలోనైనా సరే హడావిడి నిర్ణయాలు, ఆలోచన లేని నిర్ణయాలు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి.
ప్రస్తుతం కువైట్ పరిస్థితి అలానే మారింది.కార్మికులు అవసరం లేదంటూ వారిని వారి దేశాలకు వెళ్ళగొట్టిన కువైట్ ఇప్పుడు కార్మికుల కొరతతో లబోదిబోమంటోంది.
ముఖ్యంగా కార్మికుల కొరత కారణంగా కువైట్ లోని హోటల్ అండ్ రెస్టారెంట్ రంగం అతలాకుతలం అవుతోంది.హోటల్ యజమానులు దిక్కు తోచని స్థితిలో ప్రభుత్వానికి తమగోడు వెళ్ళబోసుకున్తున్నారు.
వివరాలలోకి వెళ్తే.
కరోనా కారణంగా ఎంతో మంది వలస కార్మికులు కువైట్ వదిలి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు.
ఇలా వెళ్ళిన కార్మికులు దాదాపు 8 వేల మందిపైగానే ఉంటారని తెలుస్తోంది.మళ్ళీ ఏడాది తరువాత కువైట్ తిరిగి రావడానికి విధించిన ఆంక్షల నేపధ్యంలో ఎంతో మంది ప్రవాస కార్మికులు కువైట్ లోకి వెళ్ళలేదు.
దాంతో హోటల్ అండ్ రెస్టారెంట్ రంగం కార్మికుల లేమితో తీవ్ర సంక్షోభంలో పడింది.స్థానికంగా కార్మికులు ఉన్నా హోటల్ రంగంలో నిపుణులైన వారు లేకపోవడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దాంతో హోటల్ యజమానులు నిపుణులైన కార్మికులకు గతంలో ఇచ్చిన జీతం కంటే కూడా రెట్టింపు జీతం ఇస్తామని ఆఫర్ లు ఇస్తున్నారు.కానీ హోటల్స్ ఎంత సాలరీ ఆఫర్ చేస్తున్నా ఒక్క ఉద్యోగి కూడా దొరకకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
విదేశీ కార్మికులపై బ్యాన్ విధించి ఏడాది పైగా కావస్తోంది ఇప్పటికి కూడా బ్యాన్ ఎత్తివేతపై ప్రభుత్వం నుంచీ ఎలాంటి స్పందన రావడంలేదని,కార్మికుల కొరత కారణంగా తమ రంగాలలో పనిచేసే నిపుణులకు రెట్టింపు ఇవ్వాల్సి వస్తోందని, అసలే కరోనా కారణంగా ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న తమకు రెట్టింపు జీతం ఇవ్వాలంటే ఆందోళన కలిగించే విషయమేనని అంటోంది రెస్టారెంట్ ఫెడరేషన్.విదేశీ కార్మికులపై ఉన్న నిషేధం ఎత్తివేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదని ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపాలని అంటున్నారు
.