రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంటేనే దీనిని ప్రస్తుత ట్రిబ్యునల్ లేదా కొత్త ట్రిబ్యునల్కు బదలాయింపు చేస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అపెక్స్ మండలి సమావేశంలో పేర్కొన్నారు.
అయితే, గత నెల 9న పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేసింది.
మరో వైపు తెలంగాణ తీరును తప్పు బడుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇరిగేషన్ ప్రాజెక్టులు, కృష్ణా నదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తుందని, దీని వల్ల ఏపీకి నష్టం వాటిల్లుతుందని పిటిషన్లో పేర్కొంది.పులిచింతల, నాగార్ఝున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లపై ఏపీకి కూడా నియంత్రణ ఉండాలని చెప్పింది.
అయితే, ఈ జలవివాదాలపై ఒక రాష్ట్రం పిటిషన్ ఉపసంహరించుకోవడం, మళ్లీ అదే వివాదంపై మరొక రాష్ట్రం పిటిషన్ వేయడం అనేవి చూస్తుంటే, ఇది ఖచ్చితంగా వ్యూహాత్మక రాజకీయంలో భాగమేనంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఈ వివాదంలో ఇప్పట్లో సమసిపోయే వ్యవహారం కాదని, దీన్ని ఆధారంగా చేసుకుని ప్రజల మధ్య సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందడమే ముఖ్య ఉద్దేశ్యమని అంటున్నారు.
అయితే, దీనిపై కేంద్రం కూడా స్పష్టమైన వైఖరి ఇవ్వడం లేదని తెలుస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఈ వివాదంలో జోక్యం చేసుకోకుండా, సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పి తప్పించుకుంటుంది.దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి కూడా నోటీసులు ఇస్తే, అప్పుడు మాత్రం కేంద్రం వైఖరి తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది.రెండు రాష్ట్రాల మధ్య గత రెండు నెలలుగా సాగుతున్న జలవివాదం ఎప్పుడు ముగుస్తుందనే దానిని ప్రస్తుతం సమాధానం లేదు.