బీజేపీ తో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా, కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం అవేమీ పట్టించుకోనట్లు గా వ్యవహరిస్తున్నారు.2014 ఎన్నికల సమయంలో బిజెపి, టిడిపి పొత్తు పెట్టుకున్నా .ఆ తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరును ఇప్పటికీ బీజేపీ అగ్ర నేతలు ఎవరూ మర్చిపోలేదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కుటుంబ వ్యవహారాల పైన చంద్రబాబు చేసిన కామెంట్స్ వంటివి టిడిపి, బిజెపి మధ్య ఇప్పటికీ దూరాన్ని పెంచుతూనే వస్తున్నాయి.
అయితే 2024 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోకపోతే టిడిపి రాజకీయంగా దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో , గత కొంతకాలంగా బిజెపి అడిగిన అన్ని విషయాల్లో చంద్రబాబు మద్దతు పలుకుతూనే ఉన్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లోను బిజెపి అడగకుండానే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మూర్ము కు మద్దతు ప్రకటించారు.
ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోను టిడిపి ఎన్ డి ఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటించింది.
టిడిపి ఎంపీలు తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు.
ఎన్డీఏ అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని చెప్పేందుకు ఢిల్లీలోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్ కనకమేడల రవీందర్ కుమార్ , కెసినేని నాని, రామ్మోహన్ నాయుడులు జగదీప్ ధన కర్ ను కలిశారు.ఆ సమయంలోనే అమిత్ షా కూడా అక్కడే ఉండడంతో టిడిపి ఎంపీలు ఆయనను కలిసి అమిత్ షా తో అనేక అంశాలపై చర్చించారు.
బిజెపి కోరకుండానే ఎన్డీయే అభ్యర్థికి టిడిపి మద్దతు ప్రకటించడం ద్వారా, రాబోయే రోజుల్లో టిడిపి విషయంలో బిజెపి పెద్దలు ఇదే వైఖరితో ఉంటారనే నమ్మకంతో చంద్రబాబు ఉన్నారట.ఇప్పుడు బిజెపితో సన్నిహితంగా మెలగడం ద్వారా రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుందనే లెక్కల్లో టిడిపి ఉంది.గతంలో టిడిపి బిజెపి పొత్తు కొనసాగిన సమయంలోను ఇదే విధంగా వ్యవహరించడంతో ఇప్పుడు అదే ఫార్ములాను నమ్ముకుంటోంది.2024 లో జరగబోయే ఎన్నికలు టిడిపి భవిష్యత్తు ను నిర్ణయించబోతున్నాయి.ఇక 2024 ఎన్నికల్లోనూ బిజెపి మద్దతు వైసీపీ కోరుకుంటోంది.
కానీ ఆ అవకాశం లేకుండా ఆ స్థానాన్ని తాము ఆక్రమించేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది.ఈ మేరకు తమ మధ్య దూరం తగ్గించుకునే పనిలో నిమగ్నం అయ్యింది.ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎంపీలు ద్వారా, ఆర్ఎస్ఎస్ లోని కొంతమంది కీలక నాయకుల ద్వారా మంతనాలు చేస్తూ బిజెపితో స్నేహం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటి వరకు టీడీపీ విషయంలో ఆగ్రహంగా ఉంటూ వచ్చిన బిజెపి అగ్ర నేతలు ఇప్పుడు మనసు మార్చుకుంటారో లేదో చూడాలి.
.