హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి నిలవాలని భావిస్తోంది టీఆర్ఎస్ పార్టీ.అందుకు ఎప్పటి నుంచో సన్నాహకాలు మొదలుపెట్టింది.
ఇందుకోసం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ముఖ పరిచయం కూడా లేని వేరే జిల్లాల నాయకులను పురమాయించింది.నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఇన్ చార్జులను నియమించింది.
ఇలా ఇంచార్జులు తమకు కేటాయించిన మండలాల్లో పర్యటనలు చేస్తూ… స్థానికంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి కోసం ఇంకా ఏం చేయాలో అనే దానిపై అధిష్టానానికి నివేదికలు పంపుతూ వస్తున్నారు.మరో వైపు బీజేపీ కూడా దూకుడుగానే వ్యవహరిస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ తమ పార్టీలో చేరడం తమకు కలిసి వస్తుందనే భావనలో బీజేపీ నాయకులు ఉన్నారు.ఎలాగైనా సరే హుజురాబాద్ నియోజకవర్గంలో తప్పకుండా కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.
గత కొన్నేళ్లుగా నూతన ఆసరా పింఛన్ల మాటే ఎత్తని ప్రభుత్వం ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో కొందరికి నూతనంగా ఆసరా పింఛన్లను మంజూరు చేస్తోంది.
ఇలా ఆసరా పింఛన్లను మంజూరు చేయడం మూలాన ఓటర్లను తమ వైపు ఆకర్షించుకోవచ్చని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.ఒక ఇంట్లో ఎవరికైనా నూతనంగా ఆసరా పింఛన్ మంజూరైతే ఆ ఇంట్లో ఉన్నవారందరూ అధికార పార్టీకే ఓటు వేస్తారని వారు బలంగా నమ్ముతున్నారు.
అందుకే రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కేవలం హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రమే నూతన పింఛన్లను మంజూరు చేస్తున్నారు.ఎంతో మంది అప్రూవ్ అయి కూడా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఉప ఎన్నికలు ఉన్న హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రమే ఇలా పింఛన్లు మంజూరు చేయడాన్ని రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న పలువురు నాయకులు తప్పు బడుతున్నారు.