ఉన్నవి రెండు పదవులు ఆ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది.ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి.
తెలంగాణలో రాజ్యసభ సీట్ల కోసం టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది.పెద్ద ఎత్తున నాయకులు ఆ స్థానాలను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.
ఇప్పుడు తెలంగాణలో రాజ్యసభకు వెళ్లబోయే అదృష్టవంతులైన ఇద్దరు నాయకులు ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది.ప్రగతి భవన్ లో ఈ సందర్భం గా ఎక్కడలేని హడావుడి కనిపిస్తోంది.
గతంలో ప్రచారం జరిగిన పేర్లతో పాటు, ఇప్పుడు కొత్తగా మరికొంతమంది రాజ్యసభ స్థానం కోసం అధినేతపై ఒత్తిడి పెంచుతున్నారు.అయితే ఈనెల 13వ తేదీ లోపు అభ్యర్థులను కేసీఆర్ ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న తెలంగాణ సీనియర్ నేత కె కేశవరావు మరోసారి రాజ్యసభ సభ్యత్వం కోసం ఆశలు పెట్టుకున్నారు.ఢిల్లీ రాజకీయాల్లో తనకు బాగా పలుకుబడి ఉంది కాబట్టి తప్పకుండా కేసీఆర్ తనకు రెన్యూవల్ చేస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు.ఆయనకు దాదాపు కన్ఫర్మ్ అయినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.మాజీ ఎంపీ కెసిఆర్ కుమార్తె కవిత కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై ఆమె అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.ఇక ఖమ్మం జిల్లా లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయన కోసం జగన్ కూడా సిఫార్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక పారిశ్రామికవేత్తలు మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు తో పాటు నమస్తే తెలంగాణ ఎడిటర్ దామోదర్ రావు కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు.గతంలోని వీరిద్దరిలో ఒకరికి రాజ్యసభ స్థానం దక్కుతుందని గట్టిగా ప్రచారం జరిగింది.కానీ ఆఖరి నిమిషంలో సంతోష్ ను రాజ్యసభకు పంపించారు.
దీనిపై అప్పుడే దామోదర్ అలిగారు.దీంతో ఈసారి ఆయనకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.
ఇక ఎస్సీ ఎస్టీ కోటాలో మాజీ ఎంపీలు సీతారాం నాయక్, కడియం శ్రీహరి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట.ఇలా చాలామందే ఆశావాహులు ఉన్నా అధినేత ఆశీస్సులు ఎవరికి ఉంటాయి అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.