రాజకీయాల్లో ఎప్పుడూ… ఊహించని పరిణామాలే జరుగుతుంటాయి.ఎప్పుడు ఏ పార్టీ .
ఏ నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ తెలియదు.ఈ విధంగానే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని ఏ ఒక్కరూ ఊహించలేదు.
ఎందుకంటే తెలుగుదేశం పుట్టుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరిగింది.ఇక అప్పటి నుంచి ఈ రెండు పార్టీలు ఉప్పు నిప్పు లా మాటలతో యుద్దాలు చేసుకుంటూనే వచ్చాయి.
కానీ అకస్మాత్తుగా ఎవరూ ఊహించని విధంగా… రాబోయే ఎన్నికల దృష్ట్యా .ఈ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురించి పొత్తు పెట్టుకున్నాయి.ఈ ఊహించని పొత్తుపై ఇప్పటికీ రెండు పార్టీల్లోని నాయకులు… కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి.అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోయింది అనుకున్న నేపథ్యంలో ఈ పొత్తు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఆశలు చిగురించేలా చేసింది.
గత నాలుగున్నరేళ్లుగా పీసీపీ చీఫ్ గా రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చెమటోడ్చారనే చెప్పాలి.ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ వచ్చిన తర్వాత కొంత శ్రేణుల్లోనూ ఉత్సాహం పెరిగింది.మరో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి తిరిగి చేరడంతో కొంత ఊపు వచ్చింది.అయినా ఏదో నిరుత్సాహం పార్టీలో కనిపించింది.అయితే ఈ పొత్తు ద్వారా ఎన్నో కొన్ని సీట్లలో గెలుపు తధ్యం అనే ధీమాలో కాంగ్రెస్ ఉంది.ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి ఉండదని పార్టీ విషయాలను పట్టించుకోని నేతలు ఇప్పుడు పార్టీ కార్యాలయాల్లో కన్పిస్తుండటం విశేషం.
ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించడం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ తీర్మానం చేయడంతో కొంత పార్టీ పుంజుకుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనూ, శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది.
సోనియాను, కాంగ్రెస్ పార్టీని విభజన తర్వాత తిట్టిపోసిన చంద్రబాబుతో పొత్తు ఎలా పెట్టుకుంటారంటూ సీనియర్ నేతలు వట్టి వసంతకుమార్, సి.రామచంద్రయ్యలు పార్టీని విడిచి వెళ్లిపోయారు.వారు వెళతారని ఊహించిందేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కు మరింత ఊపిరి పోసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దయెత్తున ప్లాన్ చేస్తోంది.రాహుల్ గాంధీతో రాష్ట్రంలో మూడు చోట్ల సభలను ఏర్పాటు చేసి మరోసారి ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇప్పించాలన్నది ఒక నిర్ణయం.
అలాగే పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారని సమాచారం.అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దేశ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.