పాత ప్రభుత్వానికి రోజులు ముగిసిపోతున్నాయి.కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువు తీరేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటోంది.
అయితే ఇప్పుడిప్పుడే ఆర్థిక లోటు గురించి చర్చ మొదలయ్యి కొత్త ప్రభుత్వానికి వెన్నులో వణుకుపుట్టించే విధంగా కనిపిస్తోంది.దీనంతటికీ కారణం సరిగ్గా ఎన్నికల ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఈ కొత్త చిక్కులు మొదలవ్వబోతున్నట్టు కనిపిస్తున్నాయి.
అన్నిటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఖజానా ఖాళీ కావడం.తాను ప్రకటించిన సంక్షేమ పథకాల తక్షణ అమలు కోసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించకుండా, ముఖ్యమైన బిల్లులను నిలిపివేసి ఆ సొమ్మునంతా ప్రజాకర్షక పథకాల కోసం ఖర్చుపెట్టడమే కారణంగా తెలుస్తోంది.
కొత్తగా ఏపీలో ఎవరు అధికారం చేపట్టాల్సి వచ్చినా ఉద్యోగుల జీతాల కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితే ఉంది.ఇది పాలకుల కంటే ఎక్కువగా రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలో భారీ స్థాయిలో అభివృద్ధి ఏమయినా చోటు చేసుకుండా అంటే అదీ లేదు.రాజధాని భూముల సమస్య ఐదేళ్లు గడిచినా ఇంకా అలాగే ఉంది.అమరావతి నాసిరకం నిర్మాణాల మీద సమాధానం ఇచ్చేవారు కూడా కరువయ్యారు.విభజన తరువాత ఆచితూచి అడుగులు వేయాల్సిన అధికార పక్షం వారు ఇష్టానుసారంగా పనులు చేపట్టడం వల్లే ఏపీకి ఈ పరిస్థితి తలెత్తినట్టుగా కనిపిస్తోంది.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంతా భావిస్తున్నారు.ఒక వేళ అలా జరగకపోయినా , మళ్ళీ చంద్రబాబే ముఖ్యమంత్రి అయినా ఏపీకి మాత్రం గడ్డు పరిస్థితులు తప్పవు.
ప్రస్తుతం అమరావతిలో ఉన్న నిర్మాణాలన్నీ తాత్కాలికమే.శాశ్వత నిర్మాణాల జోలికి వెళ్లాలంటే నిధుల కోసం జల్లెడ పట్టాల్సిందే.
ఇక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా పన్నులు పెంచాల్సిన పరిస్థితి ఉంది.ఏది ఏమైనా కొత్త ప్రభుత్వానికి సమస్యలు మాత్రం తప్పవనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.