మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో కొత్త జోష్ నింపేందుకు, పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు పార్టీని సమూళంగా ప్రక్షాళన చేస్తున్నారు.ఈ క్రమంలోనే అన్ని జిల్లాలో అధ్వానంగా ఉన్న పార్టీని గాడిలో పెట్టేందుకు ఎక్కడకక్కడ కొత్త నేతలకు పార్టీ పగ్గాలు ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమిస్తున్నారు.ఈ క్రమంలోనే విజయనగరం పార్లమెంటరీ జిల్లా పార్టీ పగ్గాలను చీపురుపల్లి ఇన్చార్జ్ అయిన కిమిడి నాగార్జునకు అప్పగించారు.
మాజీ మంత్రి కిమిడి కృపారాణి తనయుడు అయిన నాగార్జునకు పగ్గాలు ఇవ్వడంపై జిల్లాలో సీనియర్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.నాగార్జున యువకుడు.గతంలో తల్లి మంత్రిగా ఉన్నప్పుడు తెరచాటుగా రాజకీయాలు చేయడం మినహా ఆయన చేసేదేం లేదు.ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి మంత్రి బొత్స సత్యనారాయణపై ఓడిపోయారు.
అయితే జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉండగా.వారిని కాదని యువకుడు అయిన నాగార్జునకు పార్టీ పగ్గాలు ఇవ్వడంపై చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారు.
కళా వెంకటరావును ఏపీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారన్న వార్తల నేపథ్యంలో ఆ కుటుంబాన్ని సంతృప్తి పరిచేందుకే నాగార్జునకు పార్టీ పగ్గాలు ఇచ్చారని టాక్.విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, బొబ్బిలి, గజపతినగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ సెగ్మంట్లు ఉన్నాయి.ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు.మాజీ మంత్రి సుజయ్ కృష్ణ, ఆయన సోదరుడు బేబీ నాయన, అశోక్ కుమార్తె అదితి గజపతి, కేఏ నాయుడు లాంటి నేతలు ఉన్నా వారిని కాదని మరీ నాగార్జునకు పార్టీ బాధ్యతలు ఇచ్చారు.
ఇక ఈ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కేఏ.నాయుడు రగిలిపోతున్నారట.ఆయన తన కార్యాలయానికి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం అని బోర్డు పెట్టి మరీ నిరసన తెలిపారట.ఇక మరో సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబూరావు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
మరి కొందరు సీనియర్లు కూడా బాబు నిర్ణయంపై రగులుతున్నారట.