2020 సంవత్సరం మార్చి నెల నుంచి భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత ఒక దశలో దేశంలో 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇప్పుడిప్పుడే కరోనా కేసులతో పాటు కరోనా మరణాలు అంతకంతకూ తగ్గుతున్నాయి.ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు ఇవ్వడంతో కరోనాను త్వరలో కట్టడి చేయవచ్చని ప్రజలు భావిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో బ్రిటన్ లో విజృంభిస్తున్న కొత్తరకం కరోనా ప్రజలను మళ్లీ భయాందోళనలోకి నెట్టేస్తోంది.కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ ఏడాది ఆర్థికంగా, ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నామని, ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు భావిస్తున్న తరుణంలో కొత్తరకం కరోనా వ్యాప్తి రేటు అధికంగా ఉందని వస్తున్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
సాధారణ కరోనాతో పోలిస్తే కొత్తరకం స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు సమాచారం.
భారత్ లో సైతం కొత్త రకం కరోనా కేసులు నమోదవుతున్నాయి.బ్రిటన్ నుంచి చెన్నైకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది.ప్రస్తుతం ఆ వ్యక్తి క్వారంటైన్ లో ఉన్నాడని సమాచారం.
మరోవైపు మోదీ సర్కార్ భారత్ నుంచి బ్రిటన్ కు విమాన రాకపోకలపై ఆంక్షలు విధించింది.కొత్తరకం కరోనా వ్యాప్తి చెందుతుండటంతో కరోనా వ్యాక్సిన్లు కొత్త రకం వైరస్ పై పని చేస్తాయా.? లేదా.? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది.అయితే రష్యా శాస్త్రవేత్తలు మాత్రం తమ వ్యాక్సిన్ కొత్తరకం వైరస్ పై కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కొత్తరకం కరోనా బారిన పడకుండా రక్షించగలదని.
రష్యా ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ తెలిపారు.కొత్తరకం కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇతర వ్యాక్సిన్ కంపెనీలతో కలిసి పని చేస్తున్నామని కిరిల్ వెల్లడించారు.
స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ 95 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని సమాచారం.