అగ్ర రాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నో ఏళ్ళుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎగిరి గంతేసేలా, ఉబ్బితబ్బిబ్బై పోయేలా సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకపై గ్రీన్ కార్డ్ పొందాలంటే ప్రవాసులు ఏళ్ళ తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన అమెరికా అందుకు అనుగుణంగా కీలక మార్పులు చేస్తోంది, ఈ మార్పులలో భాగంగానే అమెరికా సెనేట్ లో కీలక బిల్లు ప్రవేశ పెట్టింది.
హెచ్ -1బి వీసాపై వచ్చి అమెరికాలో ఏడేళ్ళు ఉంటే చాలు వారు గ్రీన్ కార్డ్ పొందేందుకు అర్హులు అయ్యేలా తమ ఇమ్మిగ్రేషన్ చట్టంలో మార్పులు చేశారు.ముఖ్యంగా భారతీయ నిపుణులకు లబ్ధి చేకూరేలా ఉన్న ఈ బిల్లు సెనేట్ లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఈ తాజా బిల్లు ప్రకారం ఇకపై అమెరికాలో వరుసగా ఏడేళ్ళు గనుకా పనిచేస్తే వారు గ్రీన్ కార్డ్ పొందడానికి అర్హత సాధించినట్లే.
ఈ కీలక బిల్లును అమెరికా సెనేటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదించగా, లుజాక్, వారెన్ ,డిక్ దుర్బిన్ అనే మరి ముగ్గురు సెనేటర్లు మద్దతునిచ్చారు.
అమెరికా ప్రజా ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ బిల్లు గనుకా చట్టంగా మారితే సుమారు 80 లక్షల మంది కి అమెరికా శాశ్వత నివాస హక్కు కలుగుతుంది.
హెచ్ -1 బి పై ఏళ్ళ తరబడి పనిచేస్తున్న వాళ్ళు, వారి పిల్లలు, భాగస్వాములు అందరూ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గా మారి అమెరికా పౌరసత్వం లభిస్తుంది.
దశాబ్దాలుగా అమెరికా అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఉంటున్న హెచ్ -1బి వీసా దారులు వారి కుటుంబాలకు ఈ బిల్లు ఎంతో మేలు చేస్తుందని, వారి సేవలకు మనం గుర్తింపు ఇవ్వడం అంటే ఈ బిల్లును చట్టం రూపంలో కి తీసుకువెళ్ళడమేనని సెనేటర్ అలెక్స్ పాడిల్లా తెలిపారు.ఇదిలాఉంటే ఈ బిల్లు చట్ట రూపంలోకి మారడానికి కొంత సమయం పడుతుంది.ఈ బిల్లును ముందుగా అమెరికా సెనేట్ , ప్రజా ప్రతినిధుల సభ ఆమోదించాలి ఆ తరువాత అధ్యక్షుడు బిడెన్ సంతకంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చుతుంది.
గ్రీన్ కార్డ్ అర్హత పొందేందుకు ఉన్న వారిలో అత్యధిక శాతం మంది భారతీయ నిపుణులు ఉండటంతో ఈ బిల్లు ఎప్పుడు చట్ట రూపంలోకి మారుతుందోనని ఉత్ఖంటగా ఎదురు చూస్తున్నారు.