కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను వాడుకలోకి తీసుకొచ్చారు.ప్రస్తుతం కొత్తగా వంద రూపాయల నాణేన్ని వాడుకలోకి తీసుకువచ్చారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ 94వ జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం విడుదల చేశారు.దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, వాజ్పేయి సన్నిహితుడు ఎల్కే అధ్వాని, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వాజ్పేయీ సేవలను గుర్తుచేసుకున్నారు.అటల్ జీ లేరు అని నమ్మడానికి తన మనసు అంగీకరించడం లేదని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.‘ప్రజాస్వామ్యం మహోన్నతంగా ఉండాలని అటల్ జీ ఎప్పుడూ కోరుకునేవారు.
పార్టీ సిద్ధాంతాలపై ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు.బీజేపీని అతిపెద్ద రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషిచేశారు.
తన జీవితంలో చాలా ఏళ్లు ప్రతిపక్షంలో కొనసాగినప్పటికీ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడారు’ అని మోదీ వాజపేయి సేవలను గుర్తుచేసుకున్నారు.