కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రేక్షకులు థియేటర్ల వైపు ఆసక్తి చూపడం లేదు.దీంతో నిర్మాతలు, దర్శకులు సైతం తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయడానికే ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు ఓటీటీల ద్వారా విడుదల కాగా ఈరోజు డిస్నీ + హాట్ స్టార్ లో నయనతార ప్రధాన పాత్రలో నటించిన అమ్మోరు తల్లి సినిమా విడుదలైంది.లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న నయనతార ఈ సినిమా కోసం 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందని సమాచారం.
తమిళంలో మూక్కుత్తి అమ్మన్ పేరుతో తెరకెక్కిన సినిమా తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో డబ్ అయింది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాలపై అంచనాలను పెంచింది.మోసాలు చేస్తున్న, అక్రమంగా దేవుని మాన్యాలను కాజేస్తున్న దొంగబాబాల ఆటలకు దేవత ఏ విధంగా అడ్డుకట్ట వేసిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ సినిమాలో వినోదం పాళ్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడ్డారు.
కథ, కథనాలు బాగుండటంతో నయనతార ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.తెలిసిన కథే అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.నయనతార కాకుండా ఇంకెవరు నటించినా ఈ పాత్రకు న్యాయం చేయలేరేమో అనేలా నయన్ తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది.సినిమా విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టుముట్టినా సినిమాలో వివాదాస్పద అంశాల జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అమ్మోరు తల్లి సినిమాకు సంగీతం, నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి.ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఆకాశం నీ హద్దురా సినిమా హిట్ కాగా అమ్మోరు తల్లి సినిమాతో మరో ఓటీటీ సినిమా హిట్ అనిపించుకుంది.