గుంటూరు: ఏప్రిల్ 29 ; అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది.తాజాగా కరోనా నియంత్రణకు పెట్టిన లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేసేందుకు నాట్స్ ముందుకొచ్చింది.
గుంటూరు నగరం పూర్తిగా రెడ్ జోన్లో ఉండటంతో ఇక్కడ శివారు ప్రాంతాల్లోని నిరుపేదలకు ఆకలిబాధలు తప్పడం లేదు.ఈ విషయాన్ని స్థానికంగా ఉండే కిట్స్ కాలేజీ నాట్స్ దృష్టికి తీసుకురావడంతో నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తక్షణమే స్పందించారు.
గుంటూరు శివారు ప్రాంతాల్లో పేదల ఆకలిబాధలు తీర్చడానికి ఆర్థికసాయం అందించారు.కిట్స్ కాలేజీ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు,రెడ్క్రాస్ సోసైటీ సభ్యులు, శ్రీవన అన్నదాన సంఘానికి చెందిన అనుమలశెట్టి మల్లికార్జున, చైతన్యలతో పాటు ప్రొఫెసర్ ఆతుకూరి రాఘవ, సీతారాంల సహాకారంతో నాట్స్ పేదలకు ఉచితంగా ఆహారపొట్లాలు అందించింది.ఈ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు సాగనుంది.నేటి నుండి మూడు రోజులపాటు నిరుపేద కార్మిక కాలనీ వాసులకు ఉచితంగా ఆహారపొట్లాలు అందించనుంది.త్వరలో పేదలకు మాస్కులు, శానిటైజర్లు కూడా పంపిణి చేయాలని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి భావిస్తున్నారు.లాక్డౌన్తో ఆకలిబాధలు పడుతున్న తమకు నాట్స్ చేస్తున్న సాయం మరువలేనిదని నిరుపేదలు హర్షం వ్యక్తం చేశారు.