జీవితంలో ఎదగాలంటే ఎంత ప్రతిభ ఉన్నాగానీ, కొంత అదృష్టం కూడా ఉండాలంటారు.కొందరి జీవితాలను చూస్తే ఈ మాటలు నిజమే అనిపిస్తాయి.
ఎందుకంటే భవిష్యత్తు మీద ఉన్న ఆశతో ఏకలవ్యుడిలా సాధన చేస్తారు, ఎనలేని ప్రతిభను ప్రదర్శిస్తారు కానీ బ్రతుకు శిఖరాన్ని చేరలేక బాధలు అనుభవిస్తుంటారు.
నిజానికి ఒక మనిషి అత్యున్నత శిఖరాలకు చేరాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు.
ఓపిక, అదృష్టం, ఆ ప్రతిభను గుర్తించి సహాయం చేసే మనుషులు ఇలా పలు రకాలుగా ప్రోత్సాహన్నిస్తూ ముందుకు నడిపేవారు కూడా తోడవ్వాలి.లేకపోతే అలాంటి వారు మరుగున పడటం ఖాయం.
ఇకపోతే పంజాబ్ యువతి అయిన 23 ఏళ్ల హర్దీప్ కౌర్ పరిస్దితి కూడా ఇలాంటిదే.మూడేళ్ల కిందట మలేసియాలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నీలో పసిడి పతకం సాధించిన హర్దీప్ కౌర్.
మొత్తానికి ఇరవైకి పైగా మెడల్స్ ఆమె ఖాతాలో వేసుకున్న హర్దీప్ కౌర్ నేడు కుటుంబ పోషణ నిమిత్తం కూలీగా మారిపోయింది.తమ గ్రామంలో వరి పొలాల్లో కూలీగా పనిచేస్తూ కన్నవారికి చేదోడు వాదోడుగా ఉంటోంది.
ఇకపోతే గతంలో హర్దీప్ కు పంజాబ్ సర్కారు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినా అది గాల్లో కలిసి పోయిందట.కాగా పరాయి దేశంలో భారత ఖ్యాతిని చాటిన తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుందట ప్రతిభ ఉన్న ఈ క్రీడాకారిణి.
మరి ఇప్పటికైన అధికారులు స్పందిస్తారో లేదో అంటూ ఆశతో ఎదురుచూస్తుందట.