కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ ట్రేడ్ యూనియన్లు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెతో తెలుగు రాష్ర్టాలు స్తంభించిపోయాయి.అన్ని రంగాల్లో కార్యకలాపాలు ఆగిపోయాయి.
ప్రధానంగా బలమైన యూనియన్లు ఉన్న రవాణ రంగం, బ్యాంకింగ్ రంగాలు పూర్తిగా స్తంభించిపోయాయి.రవాణా భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ రెండు రాష్ర్టాల్లోనూ ఆర్టిసీ కార్మికులు సమ్మెలో పాలుపంచుకోవడంతో రవాణా స్తంభించిపోయింది.
ప్రయివేటు వాహనాలు కూడా సమ్మెలో ఉన్నాయి.ఆటో రిక్షా కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్తో పాటు రెండు రాష్ర్టాల్లోనూ ఆటోలు బందయ్యాయి.ట్రక్కుల, లారీల యజమానులు కూడా సమ్మెకు మద్దతు పలకడంతో ఆ వాహనాలు కూడా ఆగిపోయాయి.
పెట్రోలు బంకులు మూసేశారు.హైదరాబాదు నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ రద్దుయ్యాయి.
సిటీ బస్సులు ఆపేశారు.కార్మిక సంఘాల నాయకులు, వామపక్ష నేతలు రెండు రాష్ర్టాల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి పద్దెనిమిది వేల బస్సులు ఆగిపోయాయని సమాచారం.
ఏపీలోని కర్నూలు బస్ స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.అధికారులు కాంట్రాక్టు కార్మికులతో బస్సులు నడపించాలని ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.రెండు రాష్ర్టాల్లోనూ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి.
కొన్ని చోట్ల పాక్షికంగా పనిచేసినట్లు సమాచారం.ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు పూర్తిగా మూతపడగా, ప్రయివేటు బ్యాంకులు కొన్ని పనిచేసినట్లు చెబుతున్నారు.
ఇక తెలంగాణలోని సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్రమైన దెబ్బ తగిలింది.సమ్మెలో పాల్గొనవద్దని అధికారులు హెచ్చరించినా కార్మికులు ఖాతరు చేయలేదు.
తెలంగాణలోని మూడు జిల్లాల్లోని సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.నలభైఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయిందని, దీంతో తొమ్మిది కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం సహా ప్రభుత్వ రంగంలోని అన్ని భారీ పరిశ్రమల్లో, సంస్థల్లో సమ్మె జరిగింది.అందుతున్న సమాచారం బట్టి చూస్తే సమ్మె విజయవంతమైందని చెప్పుకోవచ్చు.
ఇది అధికార భాజపా మీద, ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ మీద వ్యతిరేకతను తెలియచేస్తోంది.