చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం 25 దేశాల్లో తన ప్రతాపాన్ని చూపుతోంది.ఇప్పటి వరకు చైనాలో కరోనా బారినపడి 2,663 మంది మరణించారు.
సోమవారం ఒక్క రోజే 71 మంది మరణించగా… హుబెయ్ ప్రావిన్స్కు చెందిన వారే 68 ఉండటం పరిస్దితి తీవ్రతకు అద్దం పడుతోంది.ఈ క్రమంలో జపాన్ తీరంలో నిలిపివేసిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కరోనా సోకినట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
దీంతో నౌకలో మొత్తం 14 మంది భారతీయులు ఈ వ్యాధి బారినపడినట్లయ్యింది.
ఈ క్రమంలో డైమండ్ ప్రిన్సెస్ నౌకలో భారత సిబ్బంది భద్రతకు సంబంధించి ఎన్ఆర్ఐ వ్యవహారాల కమీషనర్ నరేంద్ర సవాయికర్ సోమవారం జపాన్లోని భారత రాయబారికి లేఖ రాశారు.
డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్లో చిక్కుకుపోయిన గోవా నౌకాదళాల కుటుంబాల భద్రత విషయంలో తమకు ఆందోళనగా ఉందని ఆయన లేఖలో తెలిపారు.గోవా నౌకాదళానికి చెందిన కుటుంబసభ్యుల ప్రస్తుత స్థితిని గోవా ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా సవాయికర్.
ఇండియన్ ఎంబసీని కోరారు.
కాగా చైనాలో కరోనా వైరస్ జాడలు బయటపడిన క్రమంలో నౌకాలో ప్రయాణించి హాంకాంగ్లో దిగిన ఓ వ్యక్తికి కోవిడ్-19 లక్షణాలు బయటపడటంతో జపాన్ తీరంలో డైమండ్ ప్రిన్సెస్ నౌకను యోకహోమ నగరం వద్ద నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో ఈ నౌకకు 14 రోజుల క్వారెంటైన్ పీరియడ్ ముగిసింది.సముద్రయానం సందర్భంగా ఏదైనా అంటు వ్యాధి ప్రబలినప్పుడు నౌకలో ప్రయాణిస్తున్న వారిని రెండు వారాల పాటు దూరంగా ఉంచడం అనాదిగా వస్తున్న సంప్రదాయం దీనిని క్వారెంటైన్ అంటారు.
దీనిలో భాగంగానే డైమండ్ ప్రిన్సెస్ నౌకను నిలిపివేశారు.