కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు బలం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బలపడాలనే ఆలోచనలో ఉంది.అందుకే పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టింది.
దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బాగా బలపడి ఆ రాష్ట్రంలో కూడా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.తెలంగాణాలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా తయారయ్యిందో అదే రేంజ్ లో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఉండడం, ఏకంగా సీఎల్పీ మొత్తం టీఆర్ఎస్ లో విలీనం అయిపోవడంతో అక్కడ కాంగ్రెస్ కు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
ఇదే సరైన సమయంగా భావిస్తున్న బీజేపీ తెలంగాణాలో బీజేపీకి బలం చేకూర్చేలా బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.
ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులపై బీజేపీ కన్నేసింది.ఎందుకంటే కాంగ్రెస్ నుంచి గెలిచిన శాసన సభ్యుల్లో 12 మందిని టీఆర్ఎస్ పార్టీ కలిపేసుకుని సీఎల్పీ లేకుండా చేసింది.అది కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ షాక్ కలిగిస్తుండగానే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన ఆనందంలో ఉన్న బీజేపీ ఇక్కడ మిగిలి ఉన్న కాంగ్రెస్ నాయకులను బీజేపీలో చేర్చుకోవాలని చూస్తోంది.
ఈ మేరకు బీజేపీ కీలక నేత రామ్ మాధవ్ ఫోకస్ మొత్తం తెలంగాణ మీద పెట్టాడు.ఆయన వద్దకు వరుసగా ఇప్పుడు టి టిడిపి నాయకులు, టి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టేస్తున్నారు.
వీరిలో ఇటీవలే గెలిచిన కాంగ్రెస్ ఎంపీల నుంచి కొందరు ఎమ్యెల్యేలు కూడా ఉన్నారు.
ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి కీలక నాయకుడిగా ఇటీవల ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి కమలం వైపు చూస్తున్నారనే వార్తలు వైరల్ గా మారాయి.తెలంగాణాలో బీజేపీ పాగా వేయాలంటే రేవంత్ వంటి దూకుడు ఉన్న నాయకుడి అవసరం ఎంతయినా ఉందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.అంతే కాదు కాంగ్రెస్ లో కీ రోల్ పోషిస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా కమలం పార్టీలో చేరాలని భావిస్తున్నట్టు స్థానికంగా చర్చ నడుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు లేవు కాబట్టి బీజేపీతో వెళ్తేనే తమ రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి ఢోకా ఉండదనేది రేవంత్ తో సహా పార్టీ మారదామనే ఆలోచన ఉన్న నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది.