ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ప్రభావం మనదేశంలోనూ ఎక్కువగానే ఉంది.
ఇప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోగా, రోజురోజుకు మరింతగా కొత్త కేసులు పెరుగుతూ వస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.మొదట్లో పట్టణాలకే పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు పల్లెల్లోనూ ఎక్కువ అయ్యాయి.
దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి లాక్ డౌన్ నిబంధనలు విదిస్తుంది అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
చాలా రాష్ట్రాలు విధించవద్దని, ఇప్పటికే రాష్ట్రల పరిస్థితి దారుణంగా తయారైందని, మరోసారి లాక్ డౌన్ విధిస్తే రాష్ట్రాలు దివాళా తీసే పరిస్థితి వస్తాయని కేంద్రానికి మొరపెట్టుకున్నా ఈ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉండగా, తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విషయంలో క్లారిటీ ఇవ్వాలని ప్రధాని ని కోరారు.
దీనిపై క్లారిటీ ఇచ్చిన ప్రధాని ప్రస్తుతం లాక్ డౌన్ దశ ముగిసి అన్ లాక్ దశ ప్రారంభమైందని, అన్ లాక్ 1 ముగిసి అన్ లాక్ 2 ఎలా అమలు చేయాలనే నిర్ణయం పైన చర్చించాలని ముఖ్యమంత్రులతో ప్రధాని అన్నారు.
లాక్డౌన్ సమయంలో ప్రజలు క్రమశిక్షణతో మెలగాలని, కరోనా కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందకుండా, కఠిన నిబంధనలు అమలు చేసి వైరస్ వ్యాప్తి మరింత ఉధృతం అవ్వకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో చెప్పారు.అలాగే కరోనా వైరస్ సోకి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉందని, కరోనా టెస్ట్ ల సంఖ్య మరింతగా పెంచాలని, వైద్య సదుపాయాల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ జూన్ 30తో ముగిసిన నేపథ్యంలో ఈ కరోనా ప్రభావానికి గురవుతున్న రాష్ట్రాల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే విషయం పైన ప్రధాని సమావేశంలో చర్చించారు.కరోనా వైరస్ సోకుతుందనే భయాలను తొలగించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.వ్యాధిబారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని, కరోనా సోకిన వారు సైతం ఆందోళన చెందకూడదు అని ప్రధాని సూచించారు.అలాగే ప్రజలు ఒకే చోట గుమిగూడడం, కరోనా నిబంధనలు పాటించక పోవడం వంటి కారణాలతో చాలా రాష్ట్రాల్లో పరిస్థితి అదుపు తప్పిందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో రికవరీ రేటు 52.79 శాతంగా ఉందని, గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 10,794 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు.దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.5 లక్షలకు చేరిందని తెలిపారు.మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా మరో సారి లాక్ డౌన్ పొడిగించే ఆలోచన తమకు లేదని ప్రధాని క్లారిటీ ఇచ్చేశారు.ప్రతి ఒక్కరూ స్వీయ నిబంధనలతో కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయాలని ప్రధాని చెప్పకనే చెప్పారు.