ఏపీలో బలపడేందుకు బీజేపీ ఏ ఒక్క సెలబ్రెటీని వదిలేలా కనిపించడంలేదు.కాస్త ప్రజాధారణ ఉంటే చాలు వారిని పార్టీలో చేర్చేసుకుని బలపడాలని, వచ్చే ఎన్నికలనాటికి బీజేపీ ఏపీలో అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్లాలని చూస్తోంది.
ఇప్పటివరకు ఏపీలో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి ఆ పార్టీలో కీలక నాయకులనుకున్న వారిని బీజేపీలో చేర్చుకునే పనిలో సక్సెస్ అవుతూ వస్తోంది.ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న దూకుడు తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసేలా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే పార్టీకి సినీ గ్లామర్ ఉండేలా చూసుకుంటోంది.ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవిని పార్టీలో చేరేలా సంప్రదింపులు చేస్తూనే ‘ బాహుబలి’ ప్రభాస్ ను బీజేపీలో చేరేలా ప్లాన్ చేస్తోంది.
దీనిలో భాగంగానే ముందుగా ప్రభాస్ ఫ్యాన్స్ ను పార్టీలో చేరాల్సిందిగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పిలుపునివ్వడం హాట్ టాఫిక్ గా మారింది. .

తాజాగా సంఘటన పర్వ్ 2019 పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం బీజేపీ విజయవాడలోని హోటల్ ఐలాపురంలో నిర్వహించింది.ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు తో పాటు కొంతమంది కీలకమైన బీజేపీ నాయకులూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి కృష్ణంరాజు మాట్లాడుతూ, తన ఫ్యాన్స్, ప్రభాస్ ఫాన్స్ బీజేపీలో చేరి దేశం కోసం పనిచేయాలంటూ పిలుపునిచ్చారు.తన ఫ్యాన్స్ అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, కానీ వారిని ఎప్పుడూ బీజేపీలో చేరాల్సిందిగా తాను కోరలేదన్నారు.
అయితే, ఇప్పుడు చెప్తున్నానని పేర్కొంటూ పార్టీని బలోపేతం చేయడం కోసం, దేశం కోసం బీజేపీలో చేరాలన్నారు.కార్యకర్తగా ఉన్నవారికి కూడా అద్భుతమైన అవకాశాలు ఇచ్చే పార్టీ బీజేపీ అని అన్నారు.

ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా ఆ విధంగానే ఎదిగారన్నారు.ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు స్పష్టంగా అర్ధం అవుతోందన్నారు.తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ అతిపెద్డ పార్టీగా బలం పుంజుకోబోతోందన్నారు.ఈ మేరకు ఏపీలోనూ రాజకీయ ప్రకంపనలు వచ్చే అవకాశం కనిపిస్తోందన్నారు.ఇక మీటింగ్ మొత్తంలో కృష్ణం రాజు చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది.నిజంగా ప్రభాస్ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందా ? ముందుగా ఫ్యాన్స్ ను పార్టీలో చేర్చి ఆ తరువాత ‘బాహుబలి’ పార్టీలో చేరే అవకాశం ఉందా అంటూ చర్చలు మొదలయ్యాయి.నిజంగా బీజేపీ లో చేరే విషయంలో ఆ బాహుబలి నిర్ణయం ఎలా ఉండబోతోందో ?