తనకు అవసరం ఉంటే ఒకలా.అవసరం లేకపోతే ఒకలా వ్యవహరించడం రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు.
మొన్నటివరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీతో కేంద్రం సఖ్యతగా ఉంది.అడిగినవన్నీ చేసిపెట్టింది.
కానీ ఆ తరువాత బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటకి వచ్చేసింది.ఇక అప్పటి నుంచి ఏపీ పై మోదీ సర్కార్ కక్ష చూపిస్తోంది.
అదే సమయంలో తనకు ప్రస్తుతం రాజకీయంగా అవసరం అయిన తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ వారు అడిగినవి అన్ని చేసిపెడుతున్నారు.ఒకే సమస్య మీద వేర్వేరుగా స్పందిస్తూ .మోదీ మార్క్ రాజకీయం రుచి చూపిస్తున్నాడు.
తమకు సానుకూలంగా ఉండే రాష్ట్రాల అధికార పార్టీల పట్ల ఒకలా, ప్రతికూలంగా మారిన ఆంధ్రాపై మరోలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.ఫెడరల్ ఫ్రెంట్ టాపిక్ ను ఈ మధ్య కేసీఆర్ పక్కన పెట్టేసినట్టుగా కనిపించేసరికి, రాజ్యసభలో డెప్యూటీ ఛైర్మన్ ఎన్నికకి ఇతరుల మద్దతు భాజపాకి అవసరమయ్యేసరికి, తెరాస దగ్గర చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఏపీకి వచ్చేసరికి… కడప ఉక్కు కర్మాగారం మొదలుకొని కేంద్రం ఇవ్వాల్సిన ఇతర హామీలపై దాటవేత ధోరణిలో మోదీ వ్యవహరిస్తూ ఏపీ పై తనకున్న అక్కసును తెలియజేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ… ఒకే రోజున, ఒకే అంశంతో ఢిల్లీ వెళ్లాయి! ఆంధ్రాలో కడప ఉక్కు కార్మాగారం నెలకొల్పాలంటూ కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ ని ఏపీ ఎంపీలు కలిశారు.బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయమై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు! కొద్దిరోజుల తేడాలో సీఎం కేసీఆర్ కీ, మంత్రి కేటీఆర్ కీ ప్రధాని అపాయింట్మెంట్ దొరికింది.
కానీ ప్రస్తుతం దీక్ష చేస్తున్న ఏపీ ఎంపీ సీఎం రమేష్ దీక్షకు దిగడానికి ముందే ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశారు.కానీ ఫలితం లేదు.
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ దీక్షలు జరుగుతున్నా, ఏపీ ఎంపీలు ఢిల్లీలో మెరుపు సమ్మెకు రెడీ అవుతున్నా కూడా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంలేదు.కానీ తెలంగాణ విషయానికి వస్తే.
బయ్యారం ఫ్యాక్టరీ విషయమై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే, రాష్ట్రమే నిర్మించేందుకు ముందుకొస్తుందని కేటీఆర్ మీడియాతో ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.అయితే, ఈ అంశంపై ప్రధాని సానుకూలంగా స్పందించారనీ, త్వరలోనే బయ్యారం విషయమై స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఒకే విధమైన సమస్యపై రెండు రాష్ట్రాలతో వేరు వేరుగా మోదీ వ్యవహరిస్తున్న తీరు అనేక విమర్శలపాలు అవుతోంది.