నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజనే సంగతి తెలిసిందే.దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మరి కొందరు దేశానికి మోదీ లాంటి రాజకీయ నేతలు ఎంతో అవసరమని.మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.
నెటిజన్లు మాత్రం ట్విట్టర్ వేదికగా మోదీకి భారీ షాక్ ఇచ్చారు.
తమ ఆగ్రహావేశాలను సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కారు.కరోనాను కట్టడి చేయడంలో మోదీ సర్కార్ విఫలమైందని కామెంట్లు చేశారు.
మోదీ సర్కార్ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంపై దృష్టి పెట్టాలని నెటిజన్లు కోరారు.నేషనల్ అన్ ఎంప్లాయ్మెంట్ డే(జాతీయ నిరుద్యోగ దినోత్సవం) హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు ట్విట్టర్ ను హోరెత్తించారు.
దేశంలోని పలు రాజకీయ పార్టీల నేతలు, నెటిజన్లు ట్విట్టర్ ను వేదికగా చేసుకుని సోషల్ మీడియాలో నిరసనలకు దిగారు.‘హ్యాపీ బర్త్డే పీఎం మోదీ’ అనే హ్యాష్ ట్యాగ్ తో పోలిస్తే నేషనల్ అన్ ఎంప్లాయ్మెంట్ డే హ్యాష్ ట్యాగ్ కే ట్వీట్లు ఎక్కువగా వచ్చాయి.
మోదీకి అనుకూలంగా వచ్చిన ట్వీట్ల కంటే మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లే ఎక్కువగా ఉండటం బీజేపీ వర్గాలను కలవరపెడుతోంది.
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు.
దేశంలో నిరుద్యోగం రేటు అంతకంతకూ పెరుగుతోంది.దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు.
నిరుద్యోగం విషయంలో బీజేపీ తప్పేం లేకపోయినా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టటంలో బీజేపీ విఫలమవుతోంది.ప్రైవేట్ రంగంలో భారీగా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవడంతో కేంద్రం కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేయాల్సి ఉంది.