ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కాక రేపుతున్నాయి.నిన్నటి వరకు డైలాగులు వేసుకున్న అధికార ప్రతిపక్ష నేతలు ఇప్పుడు దాడులకు పాల్పడటం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభి పై కొంతమంది దుండగులు దాడులకు పాల్పడటం తో చంద్రబాబు రంగంలోకి దిగడంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది.ఇదంతా వైసీపీ గుండాలు చేస్తున్న పని అని వైసీపీ ప్రభుత్వం పై సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజా ఘటనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొడాలి నాని కొట్టిపారేశారు.బాబు చెప్పే మాటలు అన్ని అబద్ధాలు అని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ఇదే ఘటనపై టిడిపి బహిష్కృత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా స్పందించారు.పట్టాభి పై దాడి ఘటనలో నారా లోకేష్ నీ విచారిస్తే అంతా బయటకు వస్తుందని పేర్కొన్నారు.
ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయని, ముఖ్యంగా స్వగృహ ఫుడ్డు విషయంలో లోకేష్-పట్టాభి కి విభేదాలు ఉన్నాయని, అందువల్లే తెరవెనుక ఉండి నారా లోకేషే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని వల్లభనేని వంశీ ఆరోపించారు.మరోపక్క పట్టాభి పై దాడి విషయంలో వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైసిపి తూర్పు నియోజకవర్గం ఇంచార్జి దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు.