టిడిపి యువ నాయకుడు, చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ పై పెద్ద బాధ్యత లే పెట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.ఇప్పటి వరకు లోకేష్ రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు, అవమానాలకు గురయ్యారు.
లోకేష్ కు రాజకీయాలు చేతకావు అని, ఆయనను బలవంతంగా తీసుకు వచ్చి తమపై రుద్దుతున్నారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానించడం, అలాగే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయే నేతలంతా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేయడం, లోకేష్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే, ఆ పార్టీ సర్వనాశనం అవుతుంది అంటూ హెచ్చరికలు చేయడం, ఇవన్నీ చంద్రబాబుకు తీవ్ర మనోవేదనను కలిగించాయి.అందుకే లోకేష్ కు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
అలాగే స్పెషల్ గా పొలిటికల్ ట్రైనింగ్ ఇంటివద్దే తీసుకున్నారని టిడిపిలో గుసగుసలు వినిపించాయి.దాన్ని నిజం చేస్తూ లోకేష్ గతం కంటే మెరుగ్గా ప్రసంగాలు ఇవ్వడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడంలోనూ, కాస్త చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
అలాగే పార్టీ నేతలకు భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయిన టిడిపి నాయకులైన అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు.
ఈ సందర్భంగా అనంతపురం జిల్లా టిడిపి నాయకులు కాస్త ఉత్సాహం కనిపించిందని, లోకేష్ పర్యటన విజయవంతం అయ్యిందనే భావనలో ఉండగానే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు.
లోకేష్ పర్యటనకు ఊహించని విధంగా స్పందన రావడంతో లోకేష్ తో జిల్లా పర్యటనలు చేయిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ మేరకు కరోనా వ్యవహారం ముగిసిన తర్వాత లోకేష్ తో జిల్లా పర్యటన చేపట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.ఈ మేరకు ఒక షెడ్యూలు కూడా రూపొందించే పనిలో అధినేత చంద్రబాబు బిజీగా ఉన్నట్టు సమాచారం.
లోకేష్ జిల్లా టూర్ వల్ల పార్టీకి ఇప్పుడు కొత్తగా కలిసొచ్చేది ఏముంటుంది ? ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం దూకుడుకు, వేధింపుల భయంతో చాలామంది కీలక నాయకులు అజ్ఞాతవాసం గడుపుతున్నారని, ఈ సమయంలో లోకేష్ జిల్లా టూర్లు పెడితే నేతలు ముందుకు వచ్చి మళ్ళీ యాక్ట్ అవుతారా లేదా అని విషయంపైనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.