ఏపీ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ,వైసిపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.మీరు ఇలా చేశారు అంటూ ఒకపార్టీ ఆరోపిస్తే, దానికి ప్రతిగా మీరు ఇలా చేస్తున్నారు అంటూ ఒకరిపై నొకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.
అయితే తాజాగా టీడీపీ నేత,మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత,ఏపీ సీఎం జగన్ పై ఆరోపణలు చేశారు.రాజకీయంగా ఎదగడం కోసం జగన్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యను వాడుకున్నారు అంటూ లోకేష్ ఆరోపించారు.
అసలు జగన్ ను ముఖ్యమంత్రి చేయడం కోసమే వివేకా హత్య జరిగింది అంటూ ఆయన మండిపడ్డారు.జగన్ శవ రాజకీయాలు వైఎస్ కుటుంబ సభ్యులకు అర్థమైందని లోకేశ్ వ్యాఖ్యానించారు.
సీఎం కుర్చీ కోసం జగన్ చంద్రబాబునాయుడు పై అనేక ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు.
బాబాయ్ను హత్య చేయించింది చంద్రబాబేనని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ జగన్ గతంలో మొసలి కన్నీరు కార్చారని తెలిపారు.
తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సీబీఐ అవసరం లేదంటూ కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారంటూ లోకేష్ ఆరోపించారు.అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె తాజాగా హైకోర్టు లో పిటీషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే లోకేష్ ట్వీట్ ల వర్షం కురిపించి సీఎం జగన్ పై ఆరోపణలు చేశారు.