టీడీపీ అధినేత చంద్రబాబుకు తీవ్ర అసంతృప్తి ఏదైనా ఉందంటే, అది ఖచ్చితంగా ఆయన తనయుడు నారా లోకేష్ గురించే.తన తరువాత అంతటి స్థాయి లోకేష్ పొందాలనేది చంద్రబాబు తాపత్రయం.
టీడీపీ కి రానున్న రోజుల్లో నేతృత్వం వహించాల్సిన లోకేష్ తన పనితీరు మెరుగు పరుచు కోకుండా, ప్రత్యర్థులకు నిత్యం దొరికి పోతూ, విమర్శల పాలవుతున్న తీరు, చంద్రబాబుకు చాలాకాలంగా బాధను కలిగిస్తోంది.ఒకవైపు తనకు వయస్సు పైబడిపోతుండడం , తాను ఎంతో కాలం యాక్టి వ్ గా ఉండలేని పరిస్థితి ఉండడంతో, ఏం చేయాలో తెలియక, పార్టీ లోని సీనియర్ నాయకుల వద్ద బాబు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉండేవారు.
లోకేష్ ఎక్కడ ప్రసంగాలు చేసినా, అది టీడీపీకి క్రెడిట్ తీసుకు రాకపోగా, ప్రత్యర్థులకు వరంగా మారడంతో పాటు, ప్రతి దశలోనూ లోకేష్ అభాసుపాలు అవుతూ వచ్చేవారు.దీంతో లోకేష్ పర్యటన అంటేనే నియోజకవర్గాలలో నేతలు ఆందోళన చెందే పరిస్థితి ఉండేది. అదేపనిగా వైసిపి నాయకులు లోకేష్ వ్యవహారశైలిని విమర్శిస్తూ, రాజకీయ అసమర్థుడు అనే ముద్ర వేయడం వంటి వ్యవహారాలతో చాలాకాలంగా లోకేష్ సైతం ఏపీకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.కరోనా ప్రభావం విజృంభిస్తున్న సమయంలోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి అడుగుపెట్టేందుకు ఆయన సాహసం చేయలేదు.
దీనిపైన వైసిపి పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా లోకేష్ వ్యవహారాన్ని చూసుకుంటే, ఆయన బాగా మెరుగైనట్టు గా కనిపిస్తున్నారు.
పార్టీలో తన ముద్ర వేసుకుంటూ, జిల్లాల పర్యటనలు చేస్తూ, ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూస్తూ, వారితో మమేకమవుతూ, అన్నిరకాలుగా పై చేయి సాధిస్తూ వస్తుండడంతో, పార్టీ శ్రేణులలోను కాస్త ఊపు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
దీనికి తోడు కొద్ది రోజుల క్రితం నియమించిన పార్టీ కమిటీలలోనూ, లోకేష్ కు అనుకూలంగా ఉండే వారిని నియమించడం వెనుక కూడా చంద్రబాబు రాజకీయ వ్యూహం పని చేసింది.మొత్తంగా చూస్తే లోకేష్ పనితీరు, ఆయన పర్యటనలకు వస్తున్న ఫీడ్ బ్యాక్ తో చంద్రబాబులో ఉత్సాహం రెట్టింపు అయిందట.ఇకపైన లోకేష్ ఇదే విధంగా దూకుడు కొనసాగిస్తే, తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో విజయం ఖాయమని, అలాగే లోకేష్ పనితీరు పై పార్టీ నేతల్లో సందేహాలు సైతం తొలగిపోతాయని, మరింత ఉత్సాహంతో పని చేస్తారని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు.